జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాల క్రితం దీని కోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్న వీడియోని అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, పుష్పలో ఫహద్ ఫాసిల్ కు పదింతల ఇంటెన్సిటీ ఉండేలా డిజైన్ చేశారనే ప్రచారం మల్లువుడ్ మీడియాలో తిరిగింది.
తీరా చూస్తే టొవినో థామస్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న పళ్ళిచట్టంబి ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చిన అతను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తారక్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. వేరే కమిట్ మెంట్స్ వల్ల నీల్ సినిమాకు డేట్స్ కేటాయించడం కష్టంగా ఉందని అందుకే వదులుకున్నట్టు కుండ బద్దలు కొట్టేశాడు. అయితే తన స్థానంలో ఎవరు వస్తున్నారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉండనుంది.
దీనికి టొవినో సహేతుకమైన కారణాలు వివరించాడు. మలయాళంలో తక్కువ రోజుల్లో సింగల్ షెడ్యూల్ లో సినిమా తీస్తారు కాబట్టి ఒకదాని తర్వాత మరొకటి వేగంగా చేయగలుగుతున్నామని, కానీ తెలుగుకు వచ్చేటప్పటికీ ఎక్కువ డేట్లు ఇవ్వడంతో పాటు ఏడాది దాకా వేచి చూడాల్సి వస్తోంది కాబట్టే టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ కి దూరంగా ఉండాల్సి వస్తోందని క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు వదులుకోవడం వ్యక్తిగతంగా తనకు లాసే అని చెప్పాలి.
ఇది కాసేపు పక్కనపెడితే క్వాలిటీ, ఇతరత్రా కారణాల పేరుతో మన దర్శకులు ఎంత జాప్యం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. విఎఫెక్స్ డిమాండ్ చేసే కంటెంట్ అయినా, గ్రాఫిక్స్ అవసరం లేని ఎంటర్ టైనర్ అయినా ఏడాదిలోపు పూర్తి చేయడం కలలా మారిపోయింది. దీనికి తోడు రిలీజ్ డేట్ల వాయిదాలు బోనస్. ఒక్క అనిల్ రావిపూడి మాత్రమే దీనికి మినహాయింపుగా చెప్పొచ్చు. మరి టొవినో అన్నట్టు మనోళ్లు కూడా స్పీడ్ పెంచితే ఎక్కువ సినిమాలు వస్తాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates