మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలేకుండా స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్గా క్రేజ్ అందుకుంది. అయితే గత కొంతకాలంగా అమ్మడు సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వెబ్ సిరీస్లు, స్పెషల్ సాంగ్స్తో తన ఉనికిని చాటుకుంటున్న తమన్నా, ప్రస్తుతం ఒక విభిన్నమైన ఫోక్ థ్రిల్లర్తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అదే ‘వ్వాన్’ మూవీ.
ఈ సినిమా కెరీర్ను మళ్ళీ గాడిలో పెడుతుందనే ఆశలు పెట్టుకుంది. సాధారణంగా గ్లామర్ పాత్రలకు పరిమితమైన హీరోయిన్లు.. అనుష్క ‘అరుంధతి’ లాగానో, శ్రద్ధా కపూర్ ‘స్త్రీ’ సిరీస్ లాగానో ఏదైనా లేడీ ఓరియంటెడ్ లేదా పవర్ ఫుల్ థ్రిల్లర్ చేస్తే వారి ఇమేజ్ ఒక్కసారిగా మారిపోతుంది. తమన్నా కూడా ఇప్పుడు అదే రూట్లో వెళ్తోంది. ఆ మధ్య ఓదెల 2 చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు.
కానీ ఇప్పుడు వ్వాన్ మూవీ మీద ఫుల్ హోప్స్ పెట్టుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా పాత్ర చాలా ఇంటెన్స్గా ఉంటుందని టాక్. అయితే ఈ సినిమా విడుదల విషయంలో తాజాగా ఒక మార్పు చోటుచేసుకుంది. నిజానికి ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 15న విడుదల కావాల్సి ఉంది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ చిత్రం సమ్మర్ రేసు నుంచి తప్పుకుని కొత్త డేట్ కు షిఫ్ట్ అయ్యింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆగస్టు 28కి వాయిదా పడింది. రక్షాబంధన్ వీకెండ్ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. సమ్మర్ హాలిడేస్ మిస్ అయినా, లాంగ్ వీకెండ్ కలెక్షన్లకు బాగా ప్లస్ అవుతుందనేది మేకర్స్ అంచనా. వసూళ్ల పరంగా ఈ సినిమాపై బాలీవుడ్ ట్రేడ్ పండితులు భారీ అంచనాలే వేస్తున్నారు. ఫోక్ హర్రర్ జోనర్కు ప్రస్తుతం నార్త్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ‘స్త్రీ 2’ వంటి సినిమాలు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసిన నేపథ్యంలో, ‘వ్వాన్’ కూడా అదే బాటలో నడిస్తే తమన్నాకు మళ్ళీ గోల్డెన్ డేస్ మొదలైనట్లే.
రాబోయే కంటెంట్ క్లిక్కయితే ఈ సినిమా సుమారు రూ. 150 నుంచి 200 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసే అవకాశం ఉందని, లాంగ్ రన్లో సాలిడ్ కలెక్షన్లను రాబట్టగలదని అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్ లో సిద్ధార్థ్ మల్హోత్రాకు ఉన్న ఫాలోయింగ్ కూడా దీనికి తోడవ్వనుంది. ఈ చిత్రంలో తమన్నాతో పాటు మనీష్ పాల్, సునీల్ గ్రోవర్, శ్వేత తివారీ వంటి పాపులర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపక్ కుమార్ మిశ్రా, అరుణాభ్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టును బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గ్లామర్ బ్యూటీగా ఉన్న తమన్నా ఈ అడవి నేపథ్యంలో సాగే థ్రిల్లర్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
