రష్మిక అభిమానులకు సూపర్ న్యూస్

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న వార్తే నిజమైంది. కన్నడ భామ రష్మిక మందన్నా బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఆమె సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ అనే సినిమాతో హిందీలో అడుగు పెట్టనుంది. శాంతను బాగ్చి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అమర్ బుటాలతో కలిసి ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బుధవారమే ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.

‘ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్’ అంటూ ఈ సినిమా కథ గురించి సంకేతాలు ఇచ్చారు. పోస్టర్ బ్యాగ్రౌండ్లో పేలుళ్లు, మంటలు.. మ్యాప్‌లో పాకిస్థాన్ పేరు.. ఇదంతా చూస్తే టెర్రరిస్టుల కార్యకలాపాల్ని ఛేదించేందుకు ఓ ఏజెంట్ చేసే సాహసం నేపథ్యంలో ఈ సినిమా కథ నడిచేలా ఉంది. రష్మిక బాలీవుడ్ ఎంట్రీకి మంచి సినిమానే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే క్యాంపస్ లవ్ స్టోరీతో రష్మిక కథానాయికగా పరిచయమైంది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయి రష్మికను రాత్రికి రాత్రి స్టార్‌ను చేసేసింది. తర్వాత ఆమె ‘ఛలో’ లాంటి సూపర్ హిట్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై విజయ్ దేవరకొండ సరసన చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయి ఇక్కడా రష్మిక స్టార్ అయిపోయింది. తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది.

త్వరలోనే రష్మిక తమిళంలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది. కార్తి సరసన ‘సుల్తాన్’ సినిమాలో ఆమే కథానాయిక. ఇప్పటికే మూడు భాషల్ని కవర్ చేసిన రష్మిక.. ఇప్పుడు హిందీలోనూ అడుగు పెట్టేసింది. గత రెండు దశాబ్దాల్లో దక్షిణాది నుంచి బాలీవుడ్లోకి వెళ్లి సక్సెస్ అయిన హీరోయిన్లు పెద్దగా కనిపించరు. మరి రష్మిక బాలీవుడ్లో ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.