టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో గరిష్టంగా అమలులో ఉన్న ధరలతోనే అడ్వాన్స్ బుకింగ్స్ సోమవారం రాత్రి పది గంటలకు మొదలుపెట్టేశారు. బెనిఫిట్ షోలు లేకుండా నేరుగా ఏడు గంటల తర్వాతే ఆటలు ప్రారంభించబోతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ మెయిన్ సెంటర్స్ లో తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక అసలు పాయింట్ కొద్దాం.

నైజామ్ లో రేట్ల పెంపు లేకపోవడం నిర్మాతల కోణంలో కొంత అసంతృప్తి కలిగించే విషయమే అయినా ఇక్కడో పాజిటివ్ యాంగిల్ చూడాలి. మల్టీప్లెక్సుల్లో గరిష్టంగా 295 నుంచి 350 రూపాయల మధ్యలో, సింగల్ స్క్రీన్లలో 175 నుంచి 200 రూపాయల మధ్యలో పెట్టడం సాధారణ ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది. ఇది ప్లస్ గా ఎందుకు చూడాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ వందల కోట్లతో తీసిన విజువల్ గ్రాండియర్ కాదు. కేవలం పవన్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ రేట్ పెట్టాలని అడగడం కామన్ ఆడియన్స్ కి కన్విన్స్ కాదు.

సో ఇప్పుడు మరింత మెరుగైన వసూళ్లు దక్కించుకునేందుకు అవకాశం ఉంది. ఏపీలో ఎలాగూ మల్టీప్లెక్స్ 125, సింగల్ స్క్రీన్ 100 రూపాయల హైక్ ఇచ్చారు కాబట్టి అక్కడ రేట్లు మల్టీప్లెక్స్ 302 రూపాయలు, సింగల్ స్క్రీన్ 200 నుంచి 250 రూపాయల మధ్యలో ఉండబోతున్నాయి. పోలిక పరంగా ఉస్తాద్ భగత్ సింగ్ కు తెలంగాణ కంటే ఏపీ ధరలు కాస్త ఎక్కువగా అనిపిస్తున్నా వ్యత్యాసం మరీ తీవ్రంగా అయితే కాదు. కాకపోతే ఏపీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.

ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ కనక యునానిమస్ టాక్ తెచ్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో దురంధర్ రివెంజ్ ఎఫెక్ట్ కి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎలాగూ బయట మార్కెట్ల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు కాబట్టి ఇక్కడి రికవరీ మీద దృష్టి పెడితే సరిపోతుంది. ఎలాగూ ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఒక్క స్టార్ హీరో సినిమా రాలేదు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని క్యాటర్ చేయడానికి కంటెంట్ లేక థియేటర్లు లబోదిబోమన్నాయి. వాటికి ఆక్సీజెన్ ఇవ్వాల్సింది భగత్ సింగే.