వేగంగా సినిమా తీయడం సంతోషమే కానీ

నిన్న జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక పాయింట్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ డిస్కషన్ గా మారింది. ఈ సినిమాని కేవలం నలభై అయిదు రోజుల్లో పూర్తి చేశామని, మైత్రి – హరీష్ శంకర్ ప్లానింగ్ చూశాక మరిన్ని చేయాలనే ఉత్సాహం కలిగిందని అన్నారు. ఒక టయర్ 1 స్టార్ హీరో ఇంత ఫాస్ట్ గా చేయడం ముమ్మాటికీ సంతోషించాల్సిన విషయమే కానీ ప్రాక్టికల్ గా చూడాల్సిన విషయాలు కొన్నున్నాయి.

మొదటిది క్వాలిటీ. ఇప్పుడున్న పరిస్థితులు, అడ్వాన్స్ టెక్నాలజీలో ఒకప్పటిలా వేగంగా సినిమాలు పూర్తి చేయడం దర్శకుల వల్ల కావడం లేదు. అభిమానుల అంచనాలు అందుకోవడం కోసం విపరీతంగా కష్టపడాల్సి వస్తోంది. దానికోసం ఏళ్ళకేళ్ళు గడిచిపోతున్నాయి. విశ్వంభర కన్నా ఉదాహరణ అక్కర్లేదు. అయితే లక్కీగా పవన్ చేస్తున్న కథలు విజువల్ గ్రాండియర్స్ కాదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో మొదలైనవి రీజనబుల్ బడ్జెట్ లో నిర్మాతలను గట్టెక్కించినవి.

కానీ పవన్ కెరీర్ బెస్ట్ మూవీస్ అని వీటిని అనలేం. హరిహర వీరమల్లు, ఓజిలు భారీ సెటప్ తో తీసినవే అయినా వీటిలో ఒకటే విజయం సాధించింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు పవన్ కళ్యాణ్ సినిమాల జాప్యం వెనుక బోలెడు తెరవెనుక కష్టాలున్నాయి. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సిఎం అయ్యాక నటుడిగా తన వృత్తిని బ్యాలన్స్ చేసుకోలేని ఇబ్బందికర పరిస్థితిలో పవన్ ఉన్నారనేది వాస్తవం. పార్టీ కోసం సినిమాలు తప్ప ఆయన ధ్యాస ప్రజా పాలన మీదే ఉంది.

ఇలాంటి టైంలో చకచకా సినిమాలు చేయడం మంచిదే కానీ నాణ్యత ఏ మాత్రం తగ్గినా, కాంబో ఆసక్తికరంగా అనిపించకపోయినా దాని ప్రభావం ఓపెనింగ్స్, రెవిన్యూ మీద పడుతుంది. గబ్బర్ సింగ్ కలయికే అయినప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ మీద విపరీతమైన హైప్ లేదు. ఓజి లాంటి వాతావరణం కనిపించడం లేదు. అయినా రికార్డులు వస్తాయి కానీ ఇంకేదో కిక్ మిస్సయ్యిందన్న ఫీలింగ్ ఫ్యాన్స్ లో లేకపోలేదు. ఇకపై ఒక సమయంలో ఒక సినిమా చేయడం మీదే దృష్టి పెడితే మరింత మెరుగైన ఫలితాలు అందుకోవచ్చేమో. ప్రస్తుతం సురేందర్ రెడ్డి మూవీ కోసం పవన్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.