పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో చాలా కొద్దిమందికే ఉంటుంది. అన్ కండిషనల్ లవ్, సపోర్ట్ అన్న మాటలకు అర్థం పవన్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. పవన్ తమకు నచ్చని సినిమా చేస్తే.. అది మేకింగ్‌లో ఉన్నంత కాలం ఎంత వ్యతిరేకించినా సరే.. బొమ్మ థియేటర్లలోకి వచ్చిందంటే కళ్లు మూసుకుని పవన్ దర్శనం కోసం వెళ్లిపోతారు.

రీమేక్‌లు కావడం వల్ల కావచ్చు.. హీరో ఎలివేషన్లు ఆశించినంత ఉండకపోవచ్చన్న అంచనాల వల్ల కావచ్చు.. గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. ఇలా చాలా సినిమాల విషయంలో పవన్ ఫ్యాన్స్ వ్యతిరేకతను ప్రదర్శించారు. 

కానీ ఆ చిత్రాలన్నింటికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. విడుదల ముంగిట ఏమాత్రం ఆశలు లేని ‘హరిహర వీరమల్లు’ విషయంలోనూ ఇదే జరిగింది. పవన్ సినిమాల గురించి ముందు ఏమన్నా సరే.. రిలీజ్ టైంకి అన్నీ పక్కన పెట్టి థియేటర్లకు పరుగులు పెట్టేస్తారు అభిమానులు. ఐతే పవన్ అభిమానుల ఉత్సాహాన్ని నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారనే విమర్శ ఎప్పట్నుంచో ఉంది.

పవన్ సినిమాలకు పెయిడ్ ప్రిమియర్స్, బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్న నిర్మాతలు రూ.800-1000 మధ్య రేటు పెడుతున్నారు. ఈ రేట్లు మరీ ఎక్కువ అని అసంతృప్తి వ్యక్తం చేస్తూనే అభిమానులు టికెట్లు కొంటూ వస్తున్నారు. అభిమానులను దోచేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. పవన్ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు.

ఐతే పవన్ కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో మాత్రం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆచితూచి అడుగు వేసింది. ఏపీలో ప్రిమియర్స్‌కు ఎంత రేటు అడిగితే అంత ఇచ్చే పరిస్థితి ఉన్నా.. ఈ షోలకు రూ.500 రేటే అడిగారు. జీవో రావడం లాంఛనమే. బెనిఫిట్ షోలకు ఇది రీజనబుల్ రేటు అనడంలో సందేహం లేదు.

అభిమానులు చాలా సంతోషంగా ఈ రేటు పెట్టి సినిమా చూస్తారు. తెలంగాణలో రేట్ల పెంపుకి ఛాన్సే ఉన్నట్లు కనిపించడం లేదు. నార్మల్ రేట్లతోనే బెనిఫిట్ షోలు వేస్తే ఆశ్చర్యం లేదు. రెగ్యులర్ షోలకు కూడా అవే రేట్లు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇది అభిమానులతో పాటు ప్రేక్షకులందరికీ ఉత్సాహాన్నిచ్చే విషయమే. దీని వల్ల ఫుట్ ఫాల్స్ పెరిగి అంతిమంగా నిర్మాతలకు కూడా మేలే జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.