సంప్రదాయాన్ని మార్చడమే దెబ్బ కొట్టిందా

అన్ని కంటెంట్లు థియేటర్లకు సూట్ కావు. ఇది జడ్జ్ చేసే విషయంలో ఏ మాత్రం తొందరపడ్డా, అతివిశ్వాసం చూపించినా బోల్తా పడటం ఖాయం. శివాజీ, లయ జంటగా రూపొందిన ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూస’కి పబ్లిక్ టాక్, రివ్యూస్ రెండూ నిరాశజనకంగా వచ్చాయి. దృశ్యం కథని అటు ఇటు మార్చి దాన్ని కామెడీ థ్రిల్లర్ గా చెప్పాలనుకున్న ప్రయత్నం బెడిసి కొట్టిందని వసూళ్లు స్పష్టం చేశాయి. ఎంత ప్రమోషన్లు చేసినా జనాలకు ఈ సినిమాని టికెట్లు కొని చూడాలనే ఆసక్తి లేదని మార్నింగ్ షోకే తేటతెల్లమయ్యింది.

నిజానికి ఈటీవీ విన్ ప్రతి సినిమాని థియేటర్ రిలీజ్ చేయడం లేదు. లిటిల్ హార్ట్స్ ఇచ్చిన ధైర్యం, రాజు వెడ్స్ రాంబాయికి వచ్చిన ఫలితం వంశీ నందిపాటి లాంటి నిర్మాతలను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ప్రేరేపించాయి. అయితే ఇక్కడ మిస్ అయిన లాజిక్ ఒకటుంది. ఈ రెండు చిత్రాలు యూత్ ని టార్గెట్ చేసుకున్నవి. ఒకదాంట్లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటే రెండోదాంట్లో ఇంటెన్స్ లవ్ స్టోరీ ఉంది. సినిమాలు బాగుండటంతో జనం ఆదరించారు. బ్రేక్ ఈవెన్ దాటేసి తీసినోళ్లకు, నమ్మినోళ్లకు లాభాలు ఇచ్చాయి.

కానీ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసకి అలాంటి అడ్వాంటేజ్ లేకపోయింది. శివాజీ, లయ మీద ఆడియన్స్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ క్రేజ్ లేదు. ఒకవేళ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసి ఉంటే డిజిటల్ లో భారీ వ్యూస్ వచ్చేవి. అప్పుడైనా సినిమా బాగుందని అందరూ మెచ్చుకునేవారు కాదు. కానీ కనీసం ఇంట్లోనే చూసేది కదానే ఒక అడ్వాంటేజ్ వాళ్ళను ప్రేరేపించేది. ఆ ఛాన్స్ ఇప్పుడు మిస్ అయ్యింది. ఇంత నెగటివిటీ చూశాక ఓటిటిలో అయినా విరగబడి చూస్తారా అంటే అవునో కాదో వెంటనే చెప్పలేం.

ప్రస్తుతం ఈ ఫలితం గురించి ఈటీవీ బృందంలో పోస్ట్ మార్టం జరుగుతోందని వినికిడి. పబ్లిసిటీ ఖర్చులు, మార్కెటింగ్ వ్యయం కూడా తేలేనంతగా ఫ్లాప్ పడితే దాని ప్రభావం ఇతర బడ్జెట్ల మీద పడుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో కామెడీ ఉంది కదా జనం పొలోమని వచ్చేస్తారని భ్రమ పడితే ఇలాంటి షాకులే తగులుతాయి. పోనీ వీకెండ్ ఏమైనా లాగుతుందా అనుకుంటే ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వచ్చి పడింది. ఇక సోమవారం నుంచి ఎలా ఉండబోతోందో చెప్పనక్కర్లేదు. నిర్మాతగా కూడా శివాజీకిది ఊహించని షాకే.