పవన్, రానా కొట్టుకుంటే..

మొత్తానికి ఈ ఏడాది మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అయ్యప్పనుం కోషీయుం’ తెలుగు రీమేక్ విషయంలో నెలకొన్న సస్పెన్సుకు తెరపడింది. ఇందులో పవన్ ఒక హీరోగా నటించనున్న సంగతి చాలా రోజుల ముందే ఖరారవగా.. రెండో హీరోగా రానా దగ్గుబాటి నటించనున్న విషయం తాజాగా ఖరారైంది. ఈ సినిమా సోమవారం ప్రారంభోత్సవం కూడా జరుపుకోనుంది.

ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రను పవన్ చేయనుండగా.. పృథ్వీరాజ్ చేసిన ఎక్స్ ఆర్మీ మ్యాన్ పాత్రలో రానా నటించనున్నాడన్నది స్పష్టం. ఐతే ఒరిజినల్‌తో పోలిస్తే ఇక్కడ హీరోల ఇమేజ్ ఈ పాత్రల విషయంలో కొంత అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. అలాగే రానా రెండో పాత్రకు ఖరారవగానే వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందన్న చర్చ కూడా మొదలైపోయింది అప్పుడే.

మలయాళంలో పృథ్వీ రాజ్ పెద్ద హీరో. బిజు మీనన్ ఎక్కువగా క్యారెక్టర్, విలన్ పాత్రలే చేశాడు. కానీ పృథ్వీ రాజ్ ఇగో ఏమీ లేకుండా ఆయన చేతిలో దెబ్బలు తినే పాత్రలో నటించాడు. ఇక్కడ పవన్ చేతిలో రానా దెబ్బలు తినే విషయంలో పెద్దగా అభ్యంతరం లేకపోవచ్చు. కానీ సినిమాల తర్వాత తర్వాత ఇద్దరి పాత్రలు నువ్వా నేనా అన్నట్లు సాగుతాయి. చివర్లో ఒకరితో ఒకరు తలపడతారు.

ఒరిజినల్ ప్రకారం చూస్తే పవన్ కూడా రానా దెబ్బలు తినాల్సి ఉంటుంది. అలా చేస్తే పవన్ అభిమానులు ఒప్పుకుంటారా అన్నది ప్రశ్న. ‘బాహుబలి’లో ప్రభాస్ సైతం రానా చేతిలో దెబ్బలు తిన్నాడు. ఐతే వాళ్లిద్దరికీ వయసులో పెద్ద అంతరం లేదు. కానీ రానా కన్నా వయసులో పెద్దవాడు, పైగా ఇమేజ్ అంతరం చాలా ఉన్న నేపథ్యంలో మాతృకలోని సన్నివేశాలు యథాతథంగా తీస్తారా.. లేదా పవన్‌ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేస్తారా అన్నది ఆసక్తికరం. ఒరిజినల్లో మాదిరి క్లాస్‌గా సినిమాను నడిపించడం కూడా కొంచెం కష్టం కాబట్టి మసాలా అద్దే అవకాశముంది. పవన్ పాత్రకు సంబంధించి ట్రీట్మెంట్ మార్చే ఛాన్స్ కూడా ఉంది.