బ్లాక్ బస్టర్ ఫిలిం.. సీక్వెల్ కన్ఫమ్

తెలుగు ప్రేక్షకులను ఈ మధ్య కాలంలో అమితంగా ఆకట్టుకున్న డబ్బింగ్ సినిమాల్లో ‘రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్’ ఒకటి. ‘లవ్ టుడే’తో గుర్తింపు సంపాదించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నపుడు ముందు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. కానీ సినిమాకు మంచి టాక్ రావడం, రివ్యూలు పాజిటివ్‌గా ఉండడంతో జనం థియేటర్లకు కదిలారు.

తర్వాత మూవీ తెలుగులో పెద్ద హిట్‌గా నిలిచింది. తమిళంలో కూడా ఈ సినిమా బాగా ఆడింది. ఓవరాల్‌గా రూ.140 కోట్ల మేర వసూళ్లు తెచ్చుకుని బ్లాక్ బస్టర్ అయింది డ్రాగన్. ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాకు మరింత ఆదరణ దక్కింది. ప్రదీప్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఫలితమే.. ‘డ్యూడ్’ అనే డీసెంట్ మూవీకి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అంతిమంగా అది కూడా సూపర్ హిట్టయింది. ఐతే ప్రదీప్ ఫిల్మోగ్రఫీలో ‘డ్రాగన్’ చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు.

ఈ స్పెషల్ మూవీకి సీక్వెల్ రాబోతుందని దర్శకుడు అశ్వత్ మారిముత్తు కన్ఫమ్ చేశాడు. ఆదివారంతో ‘డ్రాగన్’ విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఎక్స్ ‌లో అతను ఒక పోస్టు పెట్టాడు. ప్రదీప్‌ను సెల్ఫ్ మేడ్ స్టార్‌గా అభివర్ణిస్తూ.. తమ కలయికలో వచ్చిన ‘డ్రాగన్’ మూవీ ఎంత స్పెషలో చెప్పుకొచ్చాడు. అంతే కాక పోస్టు చివర్లో తాము 2వ సారి తప్పకుండా తిరిగి వస్తామంటూ 2 నంబర్‌కు కోట్స్ పెట్టాడు అశ్వత్.

తద్వారా ‘డ్రాగన్’కు సీక్వెల్ ఉంటుందని అతను చెప్పకనే చెప్పేశాడు. ఈ రోజుల్లో సినిమా ఎలా ఉన్నా ముందే సీక్వెల్ అనౌన్స్ చేయడం మామూలైపోయింది. కానీ అన్ని సినిమాల సీక్వెల్స్ పట్ల ఆసక్తి ఉండదు. కొన్ని హిట్ సినిమాలకు కూడా సీక్వెల్స్‌ కోరుకోరు.

కానీ ‘డ్రాగన్’ మూవీకి సీక్వెల్ అంటే మాత్రం ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. అది అంత లవబుల్ సినిమా. హీరో క్యారెక్టర్ కూడా అంత బాగుంటుంది. కాబట్టి సీక్వెల్ తీస్తే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుందనడంలో సందేహం లేదు.