మళ్లీ పవన్ మీదే ఇండస్ట్రీ ఆశలు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక పెద్ద సినిమాలకు టికెట్ల ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతులు తేలిక అయ్యాయి. ఏపీలో ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగుతోంది. కానీ తెలంగాణలో మాత్రం ఏడాది కిందట్నుంచి ఇబ్బందులు తప్పట్లేదు. ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో జరిగిన విషాదం కారణంగా రేట్లు, షోలకు అనుమతులు కష్టమయ్యాయి. 

ఐతే కొన్ని నెలల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’తో మళ్లీ రేట్లు, స్పెషల్ షోలకు అనుమతులివ్వడం మొదలైంది. అలా అని ప్రతి సినిమాకూ ఏమీ జరగలేేదు. సెలక్టివ్‌గా కొన్ని పెద్ద చిత్రాలకు ఇచ్చారు. అలా ఇచ్చినపుడల్లా కోర్టు కేసులు పడడంతో ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది.

ఐతే సంక్రాంతి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’కు రేట్లు పెంచడంపై సీరియస్ అయిన కోర్టు.. ఇకపై ఏ కొత్త సినిమాకు అదనపు రేట్లు ఇవ్వాలన్నా 90 రోజుల ముందే దరఖాస్తు చేయాలని, ప్రభుత్వమూ ఓకే చేయాలని స్పష్టం చేసింది.

ప్రాక్టికల్‌గా ఇలా చేయడం అసాధ్యమనే చెప్పాలి. అంత ముందుగా రిలీజ్ డేట్ ఖరారయ్యే సినిమాలు తక్కువ. అయినా.. మళ్లీ డేట్లు మారుతుంటాయి. కాబట్టి ఇది ఆచరణ సాధ్యం కాదనే భావిస్తున్నారు. రాబోయే సినిమాల విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు.

ఐతే ప్రభుత్వం టికెట్ల ధరలకు సంబంధించిన జీవోల్లో మార్పులు చేస్తేనే రేట్ల పెంపు ప్రక్రియ సాఫీగా సాగుతుందని.. లేదంటే స్పెషల్ జీవో ఇచ్చిన ప్రతిసారీ తలనొప్పి తప్పదని.. పైగా కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో సినీ పెద్దలు చర్చలకు పూనుకునే అవకాశం కనిపిస్తోంది. 

కాగా వేసవిలో మొదటగా తెలుగు నుంచి రిలీజయ్యే పెద్ద సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే. దాని విడుదలకు ఇంకో 50 రోజుల సమయం ఉంది. కాబట్టి ఇప్పుడే దాని నిర్మాతలు, మిగతా ఇండస్ట్రీ పెద్దలు కలిసి ప్రభుత్వంతో సమస్య పరిష్కారం కోసం చర్చలు జరపాల్సిన అవసరముంది.

గత ఏడాది పవన్ సినిమాతోనే రేట్ల పెంపు పున:ప్రారంభమైంది. తర్వాత మరి కొన్ని పెద్ద చిత్రాలకు అది ప్లస్ అయింది. పవన్ సినిమా అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందిస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రయత్నిస్తే.. ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.