ఈ నటుడు… వందల కోట్ల అక్షయ పాత్ర

ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కడ బ్రేక్ ఎలా రాసి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఒక బ్లాక్ బస్టర్ జాతకాలనే మార్చేస్తుంది. ఖాళీగా ఉన్న టైం నుంచి అసలు కుటుంబ సభ్యులకే సమయం ఇవ్వలేనంత బిజీ చేస్తుంది. దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు అక్షయ్ ఖన్నా.

దురంధర్ లో విలన్ రెహమాన్ డకాయిట్ గా అతను పోషించిన స్వాగ్ ఏకంగా హీరో రణ్వీర్ సింగ్ నే డామినేట్ చేసిందనేది వాస్తవం. థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఓటిటిలో వచ్చాక కూడా తన గురించే సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురుస్తోంది. పధ్నాలుగు వందల కోట్ల క్లబ్బులో అడుగు పెట్టిన ఇండస్ట్రీ హిట్ లో తనకు సింహ భాగం ఇచ్చేశారు ఆడియన్స్.

అయితే అసలు పాయింట్ ఇది కాదు. గత కొంత కాలంగా అక్షయ్ ఖన్నా తన సినిమాలలు లక్కీ చార్మ్ గా మారుతున్నాడు. దురంధర్ కన్నా ముందు చేసిన చావా ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి మునుపు దృశ్యం 2 మూడు వందల యాభై కోట్ల దాకా వెళ్ళింది. అన్నీ అదిరిపోయే విజయాలు సాధించినవే.

మొదటి వారం అయ్యాక కూడా అర్ధరాత్రిళ్ళు షోలు వేసి మరీ జనాలతో జాగారాలు చేయించినవి. అయినా ఇంత డిమాండ్ వచ్చాక కూడా అక్షయ్ ఖన్నా తొందరపడటం లేదు. ఈ రాజీపడని ధోరణే దృశ్యం 3ని వదులుకునులా చేసింది. ఇతర నిర్మాతలను క్యూ కట్టేలా మార్చింది.

అక్షయ్ ఖన్నా నెక్స్ట్ మూవీ టాలీవుడ్ దే. ప్రశాంత్ వర్మ నిర్మాణ పర్యవేక్షణలో రూపొందుతున్న మాకాళిలో శక్తివంతమైన మహర్షి వేషం చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది. నార్త్ ఇండియా బిజినెస్ పరంగా మాకాళికి అక్షయ్ ఖన్నా ప్రత్యేక ఆకర్షణ కావడం ఖాయం.

దురంధర్ ముందు ఓకే చేయించుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇప్పుడైతే ఆయన అడిగే రెమ్యునరేషన్ కి సాధ్యమయ్యేది కాదేమో. ఏదైనా వరసగా మూడు బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న అక్షయ్ ఖన్నాని విలన్ ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. కానీ తను మాత్రం నింపాదిగా కథ నచ్చితే తప్ప చేయనని తేల్చి చెప్పేస్తున్నాడట.