క్రిష్.. మ‌ణిక‌ర్ణిక‌పై చివ‌రిసారిగా

2019 ద‌ర్శ‌కుడు క్రిష్‌కు ఓ చేదు జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో వ‌చ్చిన య‌న్టీఆర్ రెండు భాగాలూ తీవ్రంగా నిరాశ ప‌రిచాయి. మ‌రోవైపు హిందీలో క్రిష్ డైరెక్ట్ చేసిన మ‌ణిక‌ర్ణిక బాగానే ఆడినా.. దాని క్రెడిట్ ఆయ‌న‌కు ద‌క్క‌లేదు.

క్రిష్ ఈ సినిమాను పూర్తి చేశాక.. క‌థానాయిక కంగ‌నా ర‌నౌత్ రంగంలోకి దిగి మ‌ళ్లీ రీషూట్లు చేయ‌డం, ద‌ర్శ‌కురాలిగా త‌న పేరును కూడా జోడించ‌డం క్రిష్‌కు అవ‌మానంగా మారింది. దీనిపై విడుద‌ల స‌మ‌యంలో పెద్ద వివాద‌మే న‌డిచింది. క్రిష్ త‌న వాద‌న‌ను బ‌లంగానే వినిపించాడు. కానీ ఆయ‌న‌పై కంగ‌నా టీం గ‌ట్టిగానే ఎదురు దాడి చేసింది. అప్ప‌టికి ఆ వివాదం స‌ద్దుమ‌ణిగిపోగా.. క్రిష్ టాలీవుడ్‌కు తిరిగొచ్చేసి ఇక్క‌డ సినిమాలు చేసుకుంటున్నాడు.

కాగా ఆహా ఓటీటీలో తాజాగా స‌మంత నిర్వ‌హిస్తున్న సామ్ జామ్ కార్య‌క్ర‌మానికి ర‌కుల్‌ప్రీత్‌తో క‌లిసి అతిథిగా వ‌చ్చిన క్రిష్‌.. మ‌ణిక‌ర్ణిక వివాదం గురించి మాట్లాడాడు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లైంది. మ‌ణిక‌ర్ణిక గురించి తాను ఒక్క‌సారి మాత్ర‌మే బ‌హిరంగంగా మాట్లాడాన‌ని.. ఇప్పుడు చివ‌రిసారిగా ఒక‌సారి మాట్లాడుతాన‌ని క్రిష్ అన్నాడు. సినిమా పూర్తి చేసిన రెండు రోజుల‌కు కంగ‌నా ర‌నౌత్, త‌న టీం వ‌చ్చి ర‌ష్ చూసిందని క్రిష్ వ్యాఖ్యానించ‌డం ప్రోమోలో క‌నిపించింది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఫుల్ ఎపిసోడ్లో చూపించ‌నున్నారు. కాగా ఒక స్టోరీ టెల్ల‌ర్‌గా తాను ప్ర‌పంచానికి తెలియ‌కుండా పోతానేమో అన్న భ‌యం ఆ స‌మ‌యంలో త‌న‌కు క‌లిగిన‌ట్లు క్రిష్ ఆవేద‌న‌భ‌రితంగా చెప్పాడు ఈ షోలో. మిగ‌తా క‌థంతా ఫుల్ ఎపిసోడ్లో చూడాల్సి ఉంటుంది. కొన్ని రోజుల్లోనే అది రాబోతోంది. ప్రోమోను బ‌ట్టి చూస్తే మాత్రం క్రిష్ త‌న అభిప్రాయాల్ని బ‌లంగానే చెప్పిన‌ట్లుంది. కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టికొచ్చేలాగే ఉన్నాయి.