ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు ఇప్పటికీ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గానే ఉంటాయి. కేవలం సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ మాత్రమే కాకుండా, ఏప్రిల్ నెల మహేష్ బాబుకు ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది. అందుకే ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘వారణాసి’ కూడా ఏప్రిల్ రిలీజ్ వైపు మొగ్గు చూపుతుండటంతో అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది.

మహేష్ బాబు కెరీర్ మొదట్లో వచ్చిన ‘యువరాజు’ సినిమా కూడా ఏప్రిల్ (2000, 14న) లోనే విడుదలైంది. ఆ తర్వాత ఆయన స్టార్‌డమ్‌ను శిఖరాగ్రానికి చేర్చిన ‘పోకిరి’ (ఏప్రిల్ 28, 2006) సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా, మహేష్ బాబును ఒక మాస్ ఐకాన్‌గా నిలబెట్టింది ఈ సినిమానే. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ (ఏప్రిల్ 20, 2018) కూడా అదే నెలలో వచ్చి భారీ వసూళ్లను సాధించింది.

అయితే ఈ సినిమాలన్నీ కేవలం సెంటిమెంట్ వల్లే హిట్ అయ్యాయని చెప్పలేం. కంటెంట్ లో దమ్ము ఉండటం, దానికి సమ్మర్ సీజన్ తోడవ్వడం వల్ల ఆ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కూడా 2027 ఏప్రిల్ 7న విడుదల కాబోతున్నట్లు దాదాపు ఖరారు అయిపోయింది.

ఉగాది పండుగతో పాటు పండుగ సెలవులన్నీ కలిసి వచ్చేలా ఈ డేట్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. జక్కన్న తన సినిమాల విషయంలో ఎప్పుడూ పక్కా ప్లానింగ్‌తో ఉంటారు కాబట్టి, ఈ ఏప్రిల్ రిలీజ్ కూడా ఒక పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

మహేష్ బాబు మార్కెట్ స్టామినా, రాజమౌళి విజువల్ వండర్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఏప్రిల్ లో వచ్చిన సినిమాలు మహేష్ బాబుకు ఎలాగైతే బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాయో, ఈ గ్లోబల్ అడ్వెంచర్ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ తో పాటు సమ్మర్ హాలిడేస్ కచ్చితంగా పెద్ద ప్లస్ పాయింట్ అవుతాయి.