సినిమా టికెట్ చూపిస్తే హోటల్ లో డిస్కౌంట్

ఒక మంచి హిట్టు కోసం ఆది సాయికుమార్ సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు తెరపడినట్లే కనిపిస్తోంది. క్రిస్మస్ కానుకగా రిలీజైన అతడి కొత్త సినిమా ‘శంబాల’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. వీకెండ్లో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్‌కు చేరువ అయింది. వీక్ డేస్‌లో కూడా కలెక్షన్లు పర్వాలేదనిపిస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు ఈ సినిమా రన్ కొనసాగేలా ఉంది.

దీన్ని మరింత పుష్ చేసేందుకు టీం గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఐతే విశేషం ఏంటంటే.. ఈ సినిమాతో ఏ సంబంధం లేని యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రేక్షకులకు భలే ఆఫర్ ఇచ్చాడు. ‘శంబాల’ సినిమా చూసొచ్చి ఆ టికెట్ చూపిస్తే తన ‘వివాహ భోజనంబు’ హోటల్ ఛైన్స్‌లో 20 శాతం డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించారు. ‘శంబాల’ సినిమా థియేటర్లలో ఉన్నన్ని రోజులు ఈ ఆఫర్ కొనసాగుతుందని చెప్పాడు.

ఆదికి సందీప్ కిషన్ క్లోజ్ ఫ్రెండ్. తన స్నేహితుడి విజయం కోసం సందీప్ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ‘శంబాల’ ప్రమోషన్ల ప్లానింగ్‌లో కూడా తన పాత్ర ఉందట. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగానే.. అందరూ తనకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నట్లు సందీప్ వెల్లడించాడు. ఈ సినిమా సక్సెస్ ఆది కంటే తనకు ఎక్కువ సంతోషాన్నిస్తోందని అతను చెప్పాడు.

ఈ నేపథ్యంలోనే ‘శంబాల సినిమా చూడు-వివాహ భోజనంబులో 20 పర్సంట్ డిస్కౌంట్ తీస్కో’ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించాడు. జనవరి ఫస్టుకి చాలామంది ఫ్యామిలీతో బయటికి వెళ్తారని.. అలాంటి వాళ్లంతా ‘శంబాల’ సినిమా చూసొచ్చి తమ హోటల్లో డిస్కౌంట్ పొందొచ్చని అన్నాడు సందీప్.

తన బేనర్లో ఆది హీరోగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్న విషయాన్ని కూడా అతను వెల్లడించాడు. క్రిస్మస్ కానుకగానే రిలీజైన ‘పతంగ్’ అనే చిన్న సినిమాకు కూడా సందీప్ అండగా నిలిచాడు. 500 టికెట్లు గివ్ అవే ఇచ్చి ఆ సినిమాను పుష్ చేయడానికి తన వంతు సాయం చేశాడు.