ఈ నెల రెండో వారంలో రిలీజైన మోగ్లీ సినిమా మీద టీం అంతా చాలా ఆశలే పెట్టుకుంది. ఇది తొలి చిత్రం బబుల్గమ్తో సక్సెస్ అందుకోలేకపోయిన సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా చేసిన చిత్రం. ఆ చిత్ర కథానాయిక సాక్షి మదోల్కర్కు అది తొలి సినిమా. ఇక దర్శకుడు సందీప్ రాజ్ విషయానికి వస్తే అతను కలర్ ఫొటోతో ప్రతిభ చాటుకున్నప్పటికీ.. అది ఓటీటీలో రిలీజైనందుకు నిరాశ చెంది తొలి థియేట్రికల్ రిలీజ్ కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూశాడు.
మోగ్లీలో విలన్ పాత్ర చేసిన బండి సరోజ్ కుమార్ కూడా ఈ చిత్రం తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశించాడు. ఇంతమంది కెరీర్లు ఆధారపడ్డ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నెగెటివ్ రివ్యూలతో మొదలైన మోగ్లీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఈ చిత్రం పీపుల్ మీడియా సంస్థ ఖాతాలో మరో పరాజయాన్ని జమ చేసింది. ఎంతో కాన్ఫిడెంట్గా బాలయ్య సినిమా అఖండ-2తో పోటీ పడ్డ సినిమాకు గట్టి ఎదురు దెబ్బే తగిలింది.
మోగ్లీ సినిమా థియేటర్లలోకి వచ్చిన మూడు వారాల్లోపే ఓటీటీలో రిలీజవుతుండడం గమనార్హం. డిసెంబరు 13న ఈ చిత్రం రిలీజైంది. జనవరి 1న ఈటీవీ విన్లో ఈ సినిమాకు ప్రిమియర్స్ పడబోతున్నాయి. అంటే థియేటర్లలో రిలీజైన 20వ రోజుకే మోగ్లీని ఓటీటీలో చూడబోతున్నామన్నమాట.
ఓటీటీల వల్ల థియేట్రికల్ బిజినెస్ దెబ్బ తింటోందని.. డిజిటల్ రిలీజ్ గ్యాప్ పెరగాలని.. ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించే ప్రయత్నం చేయాలని ఓవైపు నిర్మాతలందరూ మైకుల ముందు మాట్లాడుతుంటారు. కానీ తమ సినిమా వరకు వచ్చేసరికి తక్కువ రోజుల్లోనే ఓటీటీకి ఇచ్చేస్తుంటారు.
టాలీవుడ్లో పెద్ద పెద్ద నిర్మాతలందరూ ఇలా చేసిన వాళ్లే. పీపుల్ మీడియా సంస్థ సైతం ఇప్పుడు అదే పని చేస్తోంది. చిన్న సినిమాలకు డిజిటల్ డీల్ పూర్తి కావడమే కష్టంగా ఉన్న నేపథ్యంలో వచ్చిన రేటుకు, తక్కువ గ్యాప్తో అయినా ఓటీటీలకు ఇచ్చేయడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. మోగ్లీ కూడా ఇలాగే తక్కువ గ్యాప్లో ఓటీటీలోకి రాబోతోంది. మరి అక్కడ ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates