కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా క్షీణించాయి. ఇరు దేశాల మధ్య సినిమా బంధం కూడా తెగిపోయింది. ఎప్పట్లా బాలీవుడ్ సినిమాలు పాకిస్థాన్లో విడుదల కావట్లేదు. అక్కడి నటీనటులు, టెక్నీషియన్లను ఇండియన్ సినిమాల కోసం తీసుకోవట్లేదు. పాకిస్థాన్లో కొందరు బాలీవుడ్ స్టార్లకు మంచి ఫాలోయింగే ఉంది.
ఖాన్ త్రయం సినిమాలు అక్కడ భారీ వసూళ్లే సాధిస్తుంటాయి. కానీ ఇప్పుడా మార్కెట్ మొత్తానికి తెరపడింది. ఇలాంటి సమయంలో ఒక హిందీ సినిమా పాకిస్థాన్లో బ్లాక్బస్టర్ అయింది. ఆ సినిమాను అక్కడి జనం ఎగబడి చూస్తున్నారు. ఐతే ఆ మూవీ అక్కడి థియేటర్లలో రిలీజ్ కాలేదు. అలా అని ఓటీటీలో కూడా అందుబాటులోకి రాలేదు. ఇంతకీ ఆ మూవీ ఏది అంటారా? దురంధర్!
అవును బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్బస్టర్ దురంధర్ను పాకిస్థానీలు ఎగబడి చూస్తున్నారు. పాకిస్థాన్లో ఆ సినిమా రిలీజ్ కాకపోయినా.. ఆన్ లైన్లో పైరసీ వెర్షన్ను పాకిస్థాన్లో పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నట్లు వెల్లడైంది. ఒక డేటా ప్రకారం ఇప్పటిదాకా పాకిస్థాన్లో దురంధర్ పైరసీ వెర్షన్ డౌన్లోడ్లు 20 లక్షలు దాటిపోయాయట. ఈ సినిమాలో పాకిస్థానీలే ప్రధాన విలన్ల సంగతి తెలిసిందే. పూర్తిగా పాక్కు వ్యతిరేకంగానే ఉంటుందీ చిత్రం. కథ అంతా కూడా పాకిస్థాన్ నేపథ్యంలోనే సాగుతుంది.
అయినా సరే.. పాకిస్థానీలు ఈ సినిమాను పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నారు. పాక్ను విలన్గా చూపించిన నేపథ్యంలో దురంధర్ను గల్ఫ్ కంట్రీస్లో నిషేధించారు. అక్కడ కూడా పైరసీ వెర్షన్ డౌన్లోడ్స్ పెద్ద ఎత్తునే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక ఇండియన్ స్పై పాకిస్థాన్కు వెళ్లి అక్కడి జనంతో కలిసిపోయి ఐఎఎస్ఐ, ఉగ్రవాదులతో కలిసి పని చేస్తూ దేశం కోసం రహస్యాలు రాబట్టే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రం ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ రూ.700 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates