ప్రభాస్‍ వాళ్లకు హ్యాండ్‍ ఇచ్చేసినట్టేనా?


ప్రభాస్‍ ప్రస్తుతం మూడొందల కోట్ల పైచిలుకు బడ్జెట్‍ పెట్టగల నిర్మాతల కోసమే చూస్తున్నాడు. అందుకే ఆదిపురుష్‍, సలార్‍ చిత్రాలను పట్టాలెక్కించాడు. ఆ చిత్రాలకు బిగ్‍షాట్స్ నిర్మాతలు. తెలుగు నిర్మాత అశ్వనీదత్‍ సినిమాను ఓకే చేసి కూడా దానిని వెనక్కు నెడుతున్నాడు. తనకు అడ్వాన్స్ ఇచ్చిన తెలుగు నిర్మాతలను ప్రభాస్‍ ఎంటర్‍టైన్‍ చేయడం లేదు. సాహోతో దెబ్బతిన్న యు.వి. క్రియేషన్స్కి ‘రాధేశ్యామ్‍’ తర్వాత బ్రేక్‍ ఇచ్చేస్తున్నాడు.

నిజానికి కెజిఎఫ్‍ దర్శకుడు ప్రశాంత్‍ నీల్‍కి అడ్వాన్స్ ఇచ్చి అతడిని ప్రభాస్‍ వద్దకు తీసుకెళ్లింది మైత్రి మూవీసే. కానీ అప్పుడీ కాంబినేషన్‍ కుదర్లేదు. తర్వాత ప్రశాంత్‍ నీల్‍ ఈ సలార్‍ ప్రాజెక్ట్ చేద్దామంటే ప్రభాస్‍ గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చాడు. ఈసారి నిర్మాతలు మారిపోయారు. అంటే మైత్రి వాళ్లకు ప్రభాస్‍ హ్యాండ్‍ ఇచ్చేసినట్టేనా? ఇంత భారీ చిత్రాలు తెలుగు నిర్మాతలకు భారం అవుతుందని, దీనికి కార్పొరేట్‍ తరహా సెటప్‍ వున్నవాళ్లే బెస్ట్ అని భావిస్తున్నాడా? ప్రభాస్‍ మాత్రం వచ్చే మూడేళ్ల వరకు మన నిర్మాతలకు దొరికే అవకాశమే లేదు. ఒకవేళ అప్పటికి మనోళ్లతో చేయాలని అనుకున్నా మళ్లీ తన సొంత సంస్థ లాంటి యువిలోనే చేస్తాడు.

ఇదిలావుంటే తెలుగు నిర్మాతలు కూడా తమ పరిధి పెంచుకుని పాన్‍ ఇండియా సినిమాలు తీసే విధంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. మూడు కోట్ల నుంచి మూడొందల కోట్ల వరకు బడ్జెట్‍ అయ్యే సినిమాలను చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా తీసేయాలని డిసైడ్‍ అయ్యారు. ఇందుకోసం కొందరు హేమాహేమీలకు ప్రత్యేక పారితోషికం ఇచ్చి మరీ ప్యానల్‍లో పెట్టుకుంటున్నారు.