నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆమె ఇబ్బంది పడుతోందని స్పష్టంగా కనిపిస్తున్నా సరే ఉద్దేశపూర్వకంగా తన మీద పడిపోయి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఎంత మాత్రం హర్షణీయం కాదు. ఏ మాత్రం పరిస్థితి అదుపు తప్పినా చాలా దారుణం జరిగి ఉండేది. ఇది చేసింది ప్రభాస్ ఫ్యాన్సా నిధి ఫ్యాన్సా అన్నది కాదు ప్రశ్న. ఇలాంటి ప్రవర్తనతో యువత ఏం చెప్పాలనుకుంటున్నారేది అసలు క్వశ్చన్. దీనికి సమాధానం దొరకటం కష్టం. ఎందుకంటే ఈ ఘటనకు కారణమైనవాళ్లకు విచక్షణ లేదు కాబట్టి.
స్టార్లను దగ్గరి నుంచి చూడాలనుకోవడం తప్పు కాదు. కానీ అది హద్దుల్లో ఉండాలి. తప్పు జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు తప్పుకోవాలి. అలా కాకుండా బరితెగించి వాళ్ళ మీద పడిపోవడం భవిష్యత్తులో హీరో హీరోయిన్లను బయటికి రాకుండా చేస్తుంది. పబ్లిక్ ని కలిసే ఇలాంటి చిన్న అవకాశాలను కూడా పోగొట్టినట్టు అవుతుంది. గతంలో ఒకసారి పూరి జగన్నాథ్ అన్నట్టు బాలయ్య తన దగ్గరికి వచ్చే అతి ఫ్యాన్స్ మీద అప్పుడప్పుడు చేయి చేసుకోవడం రైటేనని, సైకోలు సాడిస్టులు ఆ గుంపులో కలిసిపోయి ఉంటారు కాబట్టి ఎవడైనా లిమిట్స్ దాటితే బాలయ్య చేతి దెబ్బ రుచి చూస్తారని క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే అదే రైటనిపిస్తోంది. ఇక్కడ నిర్వాహకుల తప్పు కూడా ఉంది. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ వేడుక చేయాలనుకున్నప్పుడు లులు మాల్ లాంటి బిజీ ప్లేస్ ని ఎంచుకోకూడదు. సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. చోటు విశాలంగా ఉన్నప్పటికీ వేలాది మంది ఒకేసారి వస్తే అవి అకామడేట్ చేయలేవు. అలాంటప్పుడు కనీసం శిల్పకళా వేదిక లాంటి వాటిని ఎంచుకోవాలి. కానీ పబ్లిసిటీ కోసం ఇలా మాల్స్ ఎంచుకోవడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా నిధి అగర్వాల్ విషయంలో జరిగింది తప్పు. ఇకపై ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఫ్యాన్స్ తమకు తాము మార్పు తెచ్చుకోవాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates