బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద అనుమానాలు

1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా తీసిన విధానం ప్రేక్షకులను దేశభక్తిలో ఓలలాడించింది. ఇప్పుడు దురంధర్ లో రెహమాన్ డెకాయిట్ గా జనాన్ని ఊపేస్తున్న అక్షయ్ ఖన్నా ఇందులో ఒక హీరోగా నటించాడు. ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3లో బోర్డర్ చోటు దక్కించుకుంది. కమర్షియల్ హంగులు లేకుండా కేవలం యుద్ధ సన్నివేశాలతో జనాన్ని థియేటర్లకు వచ్చేలా చేయడం దీంతోనే మొదలయ్యింది. ఆ తర్వాత చాలా సినిమాలు ఈ బ్యాక్ డ్రాప్ తో వచ్చాయి కానీ బోర్డర్ స్థాయిని టచ్ చేయలేదు.

ఇప్పుడు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత బోర్డర్ 2 రానుంది. సన్నీ డియోల్ తన పాత్రను కంటిన్యూ చేస్తుండగా ఈసారి వరుణ్ ధావన్, దిల్ జిత్ దోస్తాన్జ్, ఆహన్ శెట్టి లాంటి కొత్త జనరేషన్ కుర్రాళ్ళు తోడయ్యారు. కాకపోతే నిర్మాత జెపి దత్తా మళ్ళీ 1971 ఇండో పాక్ వార్ నే కథాంశంగా తీసుకున్నారు. మొదటి భాగంలో ఒక పార్శ్వాన్ని చూపించగా ఈసారి లోంగేవాలా ఎపిసోడ్ హైలైట్ చేయబోతున్నట్టు తెలిసింది. నిన్న టీజర్ రిలీజ్ చేశారు. విజువల్స్ చూస్తుంటే గ్రాఫిక్స్ మోతాదు కాస్త తేలిపోయినట్టు అనిపించింది. ఏఐని సాధారణ జనాలు వాడటం మొదలుపెట్టాక క్వాలిటీ ఏ మాత్రం అటు ఇటు అయినా దర్శకులు దొరికిపోతున్నారు.

బోర్డర్ 2కి దర్శకుడు అనురాగ్ సింగ్. వయసురిత్యా ఆ బాధ్యతలు జెపి దత్తా వద్దనుకున్నారు. అసలే ఆడియన్స్ దురంధర్ హ్యాంగోవర్ లో ఉన్నారు. ఇప్పుడీ బోర్డర్ 2 కనక అంచనాలు అందుకోవడంలో తడబడితే దెబ్బ మాములుగా ఉండదు. సన్నీ డియోల్ ఇంత వయసులోనూ ఈ మూవీ కోసం కష్టపడటం విశేషం. జనవరి 23 విడుదల కాబోతున్న ఈ వార్ మూవీ అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. కాకపోతే బోర్డర్ మేజిక్ మళ్ళీ పునఃసృష్టించడం అంత ఈజీగా ఉండదు. గదర్ 2ఆడేసింది కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం. ఏమైనా బోర్డర్ బ్రాండ్ చెడగొట్టకపోతే అదే చాలు.