భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తోందంటే ఖచ్చితంగా అది ఆవిడ గొంతు నుంచి జాలువారిన మధురామృతమే. అలాంటి మహనీయురాలి బయోపిక్ తెరకెక్కడం చాలా అవసరం. గీతా ఆర్ట్స్ సంస్థ ప్రస్తుతం ఈ పనిలో ఉన్నట్టు సమాచారం. టైటిల్ పాత్రను సాయిపల్లవితో పోషింపజేసేందుకు ట్రై చేస్తున్నారట. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోయే ఈ ఎమోషనల్ అండ్ మ్యూజికల్ బయోపిక్ కి సంగీతం ఎవరు అందిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇప్పటి జనరేషన్ సుబ్బులక్ష్మి గారి గురించి తెలుసుకోవాలి. 1916 మదురైలో జన్మించి కేవలం పదకొండేళ్ల వయసులోనే తల్లి ప్రోత్సాహంతో 1927 తిరుచిరాపల్లి రాక్ ఫోర్డ్ గుడిలో కార్యక్రమం ఇచ్చారు. పదిహేడేళ్ల ఈడులో ప్రతిష్టాత్మక మదరాసు మ్యూజిక్ అకాడమీలో ప్రోగ్రాం చేయడం ఆవిడ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. 1938లో తమిళ మూవీ సేవా సదనంతో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. 1945లో చేసిన మీరా మూవీ సుబ్బులక్ష్మి గారికి గొప్ప గుర్తింపు తెచ్చింది. భర్త సదాశివం గారి ప్రోత్సాహం చాలా ఉండేది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా దేశవిదేశాల్లో కచేరీలు చేశారు.
సుబ్బులక్ష్మిగారిని ప్రభుత్వాలు ఎంతో గొప్పగా గౌరవించుకున్నాయి. భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామ్ మెగసాసే, సంగీత కళానిధి లాంటి ఎన్నో పురస్కారాలు ఆవిడను అలంకరించాయి. 2004లో కన్నుమూసిన సుబ్బులక్ష్మి గారి లైఫ్ లో బయటి ప్రపంచానికి తెలియని బోలెడంత డ్రామా, కష్టం, కన్నీళ్లు ఉన్నాయి. అవన్నీ సినిమాలో చూపించవచ్చు. కింగ్డమ్ ఊహించని షాక్ ఇవ్వడంతో గౌతమ్ తిన్ననూరి కసిమీద ఉన్నారు. సుబ్బులక్ష్మి కనక సరిగ్గా కనెక్ట్ అయితే మహానటి లాగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయొచ్చు. కథను 1916లో మొదలుపెట్టాలి కాబట్టి బడ్జెట్ భారీగానే అవసరం అయ్యేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates