బాలయ్యతో వస్తే మోగ్లికే మంచిది

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్ వచ్చే ఏడాది జనవరి 1కి వెళ్లిపోగా ఈషాని డిసెంబర్ 25కి షిఫ్ట్ చేశారు. కానీ మోగ్లీ వెనుకడుగు వేయలేదు. యుఎస్ లో పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేసుకోవడం, ఆ మేరకు థియేటర్ స్క్రీనింగ్ తో సహా మొత్తం షెడ్యూల్ అయిపోవడం వల్ల తగ్గకూడదనే ఉద్దేశంతో ఇండియాలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13 ప్రేక్షకులకు ముందుకు తెస్తున్నారు. అయితే ఈ పరిణామానికి ముందే మోగ్లీ దర్శకుడు సందీప్ రాజ్ ట్విట్టర్ వేదికలో తన బాధను, అసంతృప్తిని వ్యక్తం చేయడం జనాలను కదిలించింది.

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిథిగా వచ్చిన దర్శకుడు మారుతీ ఈ ప్రస్తావన తెచ్చారు. చేతిలో సోషల్ మీడియా ఉంది కదాని ట్వీట్లు వేస్తే ఎలా, బాలయ్యతో పాటు రావడం ఒక వరంగా భావించాలని, ఇప్పుడీ క్లాష్ వల్లే మోగ్లీ గురించి ఇంకా ఎక్కువ శాతం ఆడియన్స్ కి తెలిసి వచ్చిందని హితబోధ చేశారు. గతంలో శంకర్ దాదా ఎంబిబిఎస్ తో పోటీపడి దాంతో పాటు ఆనంద్ విజయం సాధించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మారుతీ చెప్పింది ముమ్మాటికీ రైటే. అయితే దర్శకులైనా, సాధారణ జనాలైనా వాళ్ళ ఉద్దేశాలు త్వరగా రీచ్ అయ్యేది సోషల్ మీడియా ద్వారానే.

దాన్ని వాడకుండా భావాలను వ్యక్తపరచడం కష్టమైపోయింది. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసుకున్న మోగ్లీ లాంటి సినిమాలకు ఈ ప్లాట్ ఫార్మ్ కీలకం. అందుకే సందీప్ రాజ్ అక్కడ స్పందించాల్సి వచ్చింది. అంత మాత్రాన ఇదేదో ఆయన్ను సమర్దిస్తున్నట్టు కాదు కానీ, ఒకవేళ తన ఆవేదన అలా వ్యక్తపరచక పోయి ఉంటే ఇండస్ట్రీ నుంచి హీరోలు, నిర్మాతలు తనకు ఎంత సపోర్ట్ ఉన్నారో తెలిసేది కాదుగా. అయినా ట్యాగ్ చేస్తే చాలు సమాధానం ఇస్తూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే మారుతీ సలహా అయితే బాగుంది. కానీ ప్రతి భావోద్వేగం నియంత్రణలో ఉండేది కాదు కాబట్టి సందీప్ రాజ్ ఆ ఫ్లోలో, ఆయన కోణంలో చేసింది రైటే.