ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్ గ్రాసర్ల లిస్టు తీసినా.. బాలీవుడ్ వెనుకబడుతూ వస్తోంది. 2023ని మినహాయిస్తే గత కొన్నేళ్లలో ప్రతిసారీ సౌత్ సినిమాలే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తూ వచ్చాయి. గత ఏడాది ‘పుష్ప: ది రూల్’ బాలీవుడ్ సినిమాలు అందుకోలేని ఎత్తులకు వెళ్లింది. కానీ 2025లో మాత్రం బాలీవుడ్ తన సత్తా చాటింది. నిలకడగా భారీ విజయాలు అందుకుంటూ సౌత్ సినిమాలను వెనక్కి నెట్టింది. 

ఏడాది ఆరంభంలో ‘చావా’ సినిమా రూ.800 కోట్ల వసూళ్లు సాధించింది తర్వాత ఏడాది మధ్యలో ‘సైయారా’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ లవ్ స్టోరీ ఏకంగా రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టింది. దసరాకి వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార: చాప్టర్-1’.. ‘చావా’ రికార్డును అధిగమించినా సరే.. ఏడాదిలో భారీ వసూళ్లు సాధించిన చిత్రాలను ఎక్కువ సంఖ్యలో అందించిన ఘనత బాలీవుడ్‌కే చెందుతుంది. 

2025 సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగిస్తూ.. చివర్లో కూడా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సిక్సర్లు కొడుతున్నారు. వారం వ్యవధిలో బాలీవుడ్ రెండు ఘనవిజయాలను అందుకుంది. ధనుష్, కృతి సనన్ జంటగా ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన ‘తేరే ఇష్క్ మే’ అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఇప్పటిదాకా ఈ చిత్రం రూ.140 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా‌ రేంజికి ఇవి భారీ కలెక్షన్లే. సినిమా సూపర్ హిట్ రేంజిని దాటేసింది. 

ఇక తర్వాతి వారం వచ్చిన రణ్వీర్ సింగ్ మూవీ ‘దురంధర్’ వారం లోపే రూ.200 కోట్ల మార్కును అందుకుంది. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉండేలా కనిపిస్తోంది. అన్నీ కలిసొస్తే రూ.500 కోట్ల మైలురాయిని కూడా అందుకోవచ్చు. క్రిస్మస్ వీకెండ్లో రానున్న ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అది కూడా హిట్టయితే.. 2025 బాలీవుడ్‌దే అని మరింత బలంగా చెప్పొచ్చు.