కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు వినగానే కోర్టులో ఉన్న దిలీప్ ఎమోషనల్ అయ్యాడు. బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ “ఇదంతా నాపై జరిగిన కుట్ర. నాకు న్యాయం చేసిన లాయర్లకు, నాకు అండగా నిలిచిన వారికి థ్యాంక్స్” అని అన్నాడు. ప్రాసిక్యూషన్ దిలీప్ ప్రమేయాన్ని నిరూపించలేకపోయింది.
దిలీప్ బయటపడ్డాడు కానీ, అసలు నేరం చేసిన పల్సర్ సునీ గ్యాంగ్ మాత్రం దొరికిపోయింది. సునీతో పాటు మరో ఐదుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. కిడ్నాప్, లైంగిక దాడి వంటి సెక్షన్ల కింద వీరు శిక్ష అనుభవించాల్సిందే. వీరికి ఎన్ని ఏళ్లు జైలు శిక్ష వేస్తారనేది డిసెంబర్ 12న కోర్టు ప్రకటించనుంది. దిలీప్తో పాటు మరో ముగ్గురిని కూడా సాక్ష్యాలు లేక కోర్టు వదిలేసింది.
ఈ తీర్పు సమయంలో బాధితురాలైన నటి కూడా కోర్టులోనే ఉన్నారు. 2017 ఫిబ్రవరిలో ఆమె కారులో వెళ్తుండగా కిడ్నాప్ చేసి, రెండు గంటల పాటు నరకం చూపించారు. ఈ ఘోరం వెనుక దిలీప్ ఉన్నాడని, అతనే ప్లాన్ చేశాడని పోలీసులు ఇన్నాళ్లు వాదించారు. కానీ కోర్టులో అది రుజువు కాలేదు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ రోజు తీర్పు వెలువడింది.
ఈ కేసు ఇంతకాలం సాగడానికి, ఇప్పుడు దిలీప్ బయటపడటానికి సాక్షులే ప్రధాన కారణం. విచారణ సమయంలో చాలామంది వెనక్కి తగ్గారు. దాదాపు 261 మంది సాక్షులను విచారిస్తే, అందులో సినీ రంగానికి చెందిన ప్రముఖులు సహా 28 మంది మాట మార్చేశారు. ఇదే ప్రాసిక్యూషన్ వాదనను బలహీనపరిచింది. సాక్ష్యాధారాలు సరిగ్గా లేకపోవడంతో దిలీప్పై కుట్ర ఆరోపణలు నిలబడలేదు. ఏదేమైనా దిలీప్ ఇన్నాళ్లు నేను అమాయకుడిని అని చెబుతూనే వచ్చాడు, చివరకు కోర్టు తీర్పుతో అదే నిజమని నిరూపించుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates