భారతీయ చలనచిత్ర గమనాన్ని మార్చిన సినిమాల్లో మొదటగా గుర్తొచ్చేపేరు షోలే. 1975లో విడుదలైన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సృష్టించిన రికార్డుల గురించి రాస్తూ పోతే పుస్తకాలు సరిపోవు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలను అతి పెద్ద కమర్షియల్ హీరోలుగా మార్చడంలో షోలే పాత్ర ఎనలేనిది. ఎన్నిసార్లు టీవీలో చూసినా బోర్ కొట్టని విధంగా దర్శకుడు రమేష్ సిప్పి తీర్చిదిద్దిన విధానం గురించి ఫిలిం మేకర్స్ స్టడీ చేస్తూనే ఉంటారు. దీని గొప్పదనం ఏంటంటే 1996లో మొదటిసారి దూరదర్శన్ ఛానల్ లో ప్రసారమైనప్పుడు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ పెట్టారా అనే రేంజ్ లో వీధులు నిర్మానుషమయ్యాయి. ఇళ్ళలో నుంచి ఎవరైనా కదిలితే ఒట్టు.
అలాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ ని 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిలిం హెరిటేజ్ సంస్థ డిసెంబర్ 12 ఇండియా వైడ్ పదిహేను వందలకు పైగా స్క్రీన్లలో షోలేని రీ రిలీజ్ చేసేందుకు సర్వం సన్నద్ధం చేసింది. 4కె కన్వర్షన్ తో పాటు డాల్బీ ఆడియోలోకి మార్చడంతో కొత్త తరం ప్రేక్షకులకు ఎన్నడూ చూడని అనుభూతి కలగనుంది. షోలేలో నటించిన అమితాబ్, ధర్మేంద్రతో పాటు రచన చేసిన సలీం జావీద్ ద్వయం, డైరెక్టర్ రమేష్ సిప్పితో పాటు జయ బచ్చన్, హేమా మాలిని అందరూ బ్రతికే ఉన్నారు. అయిదు దశాబ్దాల తర్వాత వీళ్ళతో కలిసి షోలే చూసేందుకు ఇప్పటి స్టార్లు పోటీ పడతారని వేరే చెప్పాలా.
ఇంత పెద్ద ఎత్తున షోలే రీ రిలీజ్ కావడం ఇదే మొదటిసారి. ప్రింట్ సరికొత్తగా ఉంటుందని, చాలా వర్క్ జరిగిందని అంటున్నారు. మొదటిసారి షోలే విడుదలైనప్పడు ఇప్పుడున్న వాళ్లలో డెబ్భై శాతానికి పైగా అసలు పుట్టే ఉండరు. కాబట్టి లైవ్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడా అవకాశం దొరికింది. వచ్చే నెల ఒక పెద్ద ఈవెంట్ చేయడం ద్వారా పునః విడుదలకు స్వాగతం పలకాలని టీమ్ ప్లాన్ చేస్తోంది ధర్మేంద్ర ఇటీవలే అనారోగ్యంతో చికిత్స తీసుకుని కోలుకున్న నేపథ్యంలో ఇప్పుడీ న్యూ షోలే మరింత స్పెషల్ గా మారనుంది.ఎవరైనా సరే మిస్ చేసుకోకూడని అవకాశం ఇది.
Gulte Telugu Telugu Political and Movie News Updates