3 రిలీజులకు మెగాస్టార్ ఒప్పుకుంటారా

వచ్చే సంవత్సరం చిరంజీవి రెండు సినిమాలు రిలీజ్ కావడం పక్కానే కానీ మరొకటి కూడా వస్తుందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ఉంది. జనవరిలో మన శంకరవరప్రసాద్ గారు, వేసవిలో విశ్వంభర రాకతో సగం సంవత్సరం కాకుండానే ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా దక్కుతుంది. ఇవి కాకుండా బాబీ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించే భారీ యాక్షన్ మూవీని డిసెంబర్ లో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోందనే వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ కోణంతో పాటు మెగా యాంగిల్ లో చూస్తే దీనికి ఛాన్స్ చాలా తక్కువ. అదెలాగో చూద్దాం.

భోళా శంకర్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఇప్పుడు స్పీడ్ పెంచిన మాట వాస్తవమే కానీ మరీ రవితేజ, నాని రేంజ్ లో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలన్న లక్ష్యంతో లేరు. కాకపోతే సంవత్సరానికి కనీసం ఒక్కటైనా థియేటర్ రిలీజ్ ఉండాలనేది ప్రాధమిక టార్గెట్. మెహర్ రమేష్ డిజాస్టర్ వల్ల ఈ ప్లానింగ్ డిస్టర్బ్ అయిపోయింది. దీని సంగతలా ఉంచితే బాబీ తీస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఏదో అనిల్ రావిపూడి స్టైల్ లో నెలల్లో తీసేది కాదట. షూటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైం డిమాండ్ చేస్తుందట. అందుకే డెడ్ లైన్ లాంటివి పెట్టుకోకూడదని ముందే డిసైడ్ అయ్యారట.

అలా చూసుకుంటే 2027లోనే చిరు బాబీ మూవీ వస్తుంది. ఒకే సంవత్సరంలో చిరంజీవి రెండు సినిమాలు చివరిసారి రిలీజయ్యింది 2005లో. అందరివాడు, జై చిరంజీవా రెండూ నిరాశపరిచాయి. మూడు రిలీజైన చివరి ఏడాది 2001. మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ పూర్తి అంచనాలను అందుకోలేకపోయాయి. వీటి తర్వాత చిరు సోలో హీరోగా చేసిన సినిమాలు ఒకటి మించి ఎప్పుడూ విడుదల కాలేదు. సో రెండు దశాబ్దాల తర్వాత దాన్ని బ్రేక్ చేయడం సంతోషమే కానీ మరీ ట్రిపుల్ ప్యాక్ అంటేనే నమ్మశక్యంగా లేదు. మార్చిలో కనక ప్యారడైజ్ విడుదలైతే చిరు శ్రీకాంత్ ఓదెల మూవీ వేసవి నుంచి స్టార్ట్ అవుతుంది.