టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్లోకి అడుగుపెడుతూ తెరకెక్కించిన చిత్రం.. జాట్. బాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన సన్నీ డియోల్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. సన్నీకి మూడేళ్ల ముందు అస్సలు డిమాండ్ లేదు కానీ.. ‘గదర్-2’తో సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో ఆయనకు మళ్లీ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ను క్యాష్ చేసుకుందామని ‘జాట్’ తీశారు కానీ.. అది థియేటర్లలో పెద్దగా వర్కవుట్ కాలేదు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాస్ మసాలా కథతో, ఫుల్ ఎలివేషన్లతో ఈ సినిమా తీశాడు. కానీ ఎందుకో జనం థియేటర్లకు వచ్చి సినిమా చూడలేదు. కానీ నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తే మాత్రం విరగబడి చూశారు. థియేటర్లలో యావరేజ్ అనిపించుకున్న సినిమా.. ఓటీటీలో మాత్రం బ్లాక్బస్టర్ అయింది.
‘జాట్’ సినిమా వచ్చాక నెట్ ఫ్లిక్స్కు లక్షల్లో కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారట. దీంతో ఆ సంస్థ ‘జాట్-2’ తీస్తే డిజిటల్ రైట్స్ కోసం భారీగా రేటు ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. ఈ విషయాన్ని వివరంగా చెప్పలేదు కానీ.. డిజిటల్ రిలీజ్ విషయంలో ఉన్న డిమాండ్ వల్లే ‘జాట్-2’ తీయబోతున్నట్లుగా మైత్రీ అధినేతలు విలేకరులతో చెప్పడం విశేషం. థియేటర్లలో ‘జాట్’ అనుకున్నంత బాగా ఆడలేదని కూడా వారు అంగీకరించారు.
ఐతే ‘జాట్-2’ చేయడానికి సన్నీ డియోల్ రెడీగానే ఉన్నప్పటికీ.. దర్శకుడు గోపీచంద్ మాత్రం అందుబాటులో లేడు. తన దగ్గర కథ కూడా రెడీగా లేదు. గోపీచంద్.. బాలయ్యతో సినిమాకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేరే దర్శకుడితో ‘జాట్-2’ తీయడానికి చూస్తున్నారు మైత్రీ అధినేతలు. భలే మంచి రోజు, దేవదాస్, మనమే చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ అతను ఇలాంటి మాస్ మూవీని డీల్ చేయగలడా అన్నదే డౌటు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
