పెద్ద సినిమాలు ముంచేస్తే చిన్న సినిమా కాపాడింది

టాలీవుడ్లో పేరున్న నిర్మాణ సంస్థల్లో భవ్య క్రియేషన్స్ ఒకటి. భవ్య సిమెంట్స్ అధినేత అయిన ఆనంద్ ప్రసాద్ ఈ సంస్థకు అధినేత. ఎక్కువగా యాక్షన్ హీరో గోపీచంద్‌తో సినిమాలు తీసిన ఈ సంస్థ.. శౌర్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్లు డెలివర్ చేసింది. చివరగా ఈ సంస్థలో వచ్చిన హిట్ అంటే.. ‘లౌక్యం’యే. ఆ ఉత్సాహంలో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను లైన్లో పెట్టారు ఆనంద్ ప్రసాద్.

గోపీచంద్‌తోనే తీసిన ‘సౌఖ్యం’ మీద చాలా ఎక్కువ ఖర్చే పెట్టేశారు. అది కాస్తా డిజాస్టర్ అయింది. సందీప్ కిషన్, నారా రోహిత్, సుధీర్ బాబు, ఆది లాంటి యంగ్ హీరోలను కలిపి ‘శమంతకమణి’ అనే మల్టీస్టారర్ కూడా తీసిందీ సంస్థ. హీరోల రేంజ్ తక్కువే కానీ.. దీని మీద కూడా బడ్జెట్ తక్కువేమీ పెట్టలేదు. అది సైతం నిరాశ పరిచింది. దాని తర్వాత ఆనంద్ ప్రసాద్ తమ సంస్థలో తొలిసారిగా ఓ పెద్ద హీరోతో సినిమా నిర్మించాడు. అదే.. పైసా వసూల్.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం సైతం డిజాస్టరే అయింది. ఈ సినిమా ద్వారా బాలయ్యతో కలిగిన పరిచయం కలిసొచ్చి తెలుగుదేశం టికెట్ ద్వారా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు ఆనంద్ ప్రసాద్. అక్కడా నిరాశే వ్యక్తమైంది. బాగా డబ్బులు పోగొట్టుకున్నారాయన. ఇలా వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో ఒక్కసారిగా బడ్జెట్ తగ్గించుకుని చిన్న సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆయన అందించిన చిన్న సినిమా ‘ఓ పిట్ట కథ’. ఈ సినిమాకు ఆశించిన ఫలితం దక్కకపోయినా.. డబ్బులైతే పోలేదు.

ఈ కోవలోనే ఇప్పుడు భవ్య క్రియేషన్స్ నుంచి ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమా వచ్చింది. పెద్దగా పేరు లేని నటీనటులు, కొత్త టెక్నీషియన్లతో.. తక్కువ బడ్జెట్లో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. ఈ సినిమాతో భవ్య క్రియేషన్స్‌కు మంచి పేరూ వచ్చింది. ఇటు నిర్మాత హ్యాపీ.. అటు సినిమాను రిలీజ్ చేసిన ప్రైమ్ వాళ్లూ హ్యాపీ. మొత్తానికి ఆనంద్ ప్రసాద్‌ను పెద్ద సినిమాలు ముంచేస్తే ఇలా ఓ చిన్న సినిమా కాపాడిందన్నమాట. ఈ సంస్థ నుంచి త్వరలో చంద్రశేఖర్ యేలేటి-నితిన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘చెక్’ రాబోతోంది. దానిపై మంచి అంచనాలే ఉన్నాయి.