తాజ్ మహల్ స్టోరీని తవ్వుతున్న బాలీవుడ్

కశ్మీర్ ఫైల్స్.. కేరళ స్టోరీ.. బెంగాల్ ఫైల్స్.. గత కొన్నేళ్లలో బాగా వివాదాస్పదం అయిన సినిమాలివి. బీజేపీ స్పాన్సర్ చేస్తున్న ప్రాపగండా సినిమాలంటూ వీటిపై ఒక వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడితే.. ఇంకో వర్గం మాత్రం చరిత్రలో మరుగునపడిపోయిన కఠోర వాస్తవాలను చూపించి, జనాల కళ్లు తెరిపించిన చిత్రాలంటూ వీటిని కొనియాడింది. విమర్శలు ఎలా ఉన్నప్పటికీ బాలీవుడ్లో ఈ తరహా సినిమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కోవలో వస్తున్న కొత్త సినిమా.. ది తాజ్ స్టోరీ.

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ గురించి తెర వెనుక వాస్తవాలను తెలియజేసే సినిమాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇందులో లెజెండరీ నటుడు పరేష్ రావల్ లీడ్ రోల్ చేశారు. తుషార్ అమ్రిష్ గోయెల్ దర్శకత్వంలో సురేష్ ఝా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా లాంచ్ చేశారు.

యమునా నది ఒడ్డున కూర్చుని తాజ్ మహల్‌ను పరేష్ రావాల్ చూస్తుండగా.. ఆయన వాయిస్ ఓవర్‌తోనే ఈ టీజర్ సాగింది. తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటని.. ఇది కొందరికి సమాధి అయితే ఇంకొందరికి మందిరమని.. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, దీని గురించి మీకేం తెలుసు అనే ప్రశ్నలతో టీజర్ మొదలైంది. ప్రతి సామ్రాజ్యానికీ ఒక రహస్య గది ఉంటుందని.. ఈ నెల చివర్లో తాజ్ మహల్‌కు సంబంధించిన పెద్ద రహస్య తెలుస్తుందని.. లోపల చూసే ధైర్యం ఉందా అంటూ టీజర్‌ను ముగించారు.

టీజర్ సాగిన తీరును బట్టి చూస్తే.. తాజ్ మహల్ అనే అద్భుత కట్టడం వెనుక ఉన్న చీకటి కోణాలను ఈ సినిమాలో చూపిస్తారేమో అనిపిస్తోంది. కచ్చితంగా ముస్లింలు, లౌకిక వాదుల నుంచి ఈ సినిమా పట్ల వ్యతిరేకత రావడం, దీనిపై ప్రాపగండా మూవీగా ముద్ర వేయడం ఖాయం. అదే సమయంలో బీజేపీ మద్దతుదారులు ఈ సినిమాను కొనియాడతారనడంలో సందేహం లేదు. మరి అంతిమంగా సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ నెల 31న ‘ది తాజ్ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.