కరణ్ జోహార్‌… బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్…

కరణ్ జోహార్.. బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. ఏటా ఆయన సంస్థ నుంచి రెండు మూడు సినిమాలైనా వస్తుంటాయి. దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. కొన్నేళ్ల తర్వాత ప్రొడక్షన్లోకి వచ్చి నిర్మాతగానే బిజీ అయిపోయిన కరణ్.. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ధర్మ ప్రొడక్షన్ సంస్థలో విరామం లేకుండా సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఒకప్పుడు ఈ సంస్థ నిలకడగా విజయాలు అందుకునేది. కానీ గత కొన్నేళ్ల నుంచి మాత్రం ధర్మ ప్రొడక్షన్స్ పేరు బాగా చెడిపోతోంది.

కరణ్ ముట్టుకున్న ప్రాజెక్టల్లా డిజాస్టర్ అయిపోతోంది. చివరగా ‘కిల్’ మూవీతో హిట్ కొట్టాడు కరణ్ జోహార్. అంతకుముందు ఆయన వరుసగా ఫ్లాపులు చూశాడు. ‘కిల్’తో కొంచెం పుంజుకున్నట్లు కనిపించినా.. మళ్లీ అపజయాలు వెంటాడుతూ ఉన్నాయి.

గత ఏడాది కరణ్ నుంచి వచ్చిన యోధ, ఏ వాతా మే వాతా, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బ్యాడ్ న్యూజ్, జిగ్రా తీవ్ర నిరాశకు గురి చేశాయి. వీటిలో బ్యాడ్ న్యూజ్ ఓ మాదిరిగా ఆడింది. మిగతావన్నీ డిజాస్టర్లే. ఈ ఏడాది అయితే కరణ్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఓటీటీలో రిలీజైన నదానియాన్, సర్జమీన్ ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయాయి. ఇక థియేటర్లలో రిలీజైన సినిమాలు కరణ్‌కు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి.

అకాల్, కేసరి: చాప్టర్-2, ధడక్-2 ఫ్లాప్ అయ్యాయి. హోమ్ బౌండ్ అనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న, ఆస్కార్‌కు ఇండియా నుంచి నామినేట్ అయిన సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇందులో లీడ్ రోల్ చేసిన జాన్వి కపూర్‌తోనే కరణ్ తీసిన మరో సినిమా ‘సన్నీ సంస్కారి కీ తుల్సీ కుమారి’ లేటెస్ట్‌గా కరణ్‌కు తగిలిన మరో షాక్. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ‘కాంతార: చాప్టర్-1’ జోరు ముందు నిలవలేకపోయింది.

వీకెండ్లోనే సరిగా ఆడని ఈ చిత్రం సోమవారం నుంచి వాషౌట్ అయిపోయింది. జనాల్లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది. దీంతో కరణ్ ఖాతాలో మరో డిజాస్టర్ జమ అయింది. దీంతో కరణ్ కొత్త ప్రాజెక్టులేమీ అనౌన్స్ చేయట్లేదు. కొంత కాలం ఆయన నిర్మాణానికి దూరంగా ఉండబోతున్నాడని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి.