వరప్రసాద్ వ్యాపారం ఇంకా మొదలెట్టలేదు

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు బిజినెస్ గురించి సోషల్ మీడియాతో పాటు వివిధ వర్గాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సీడెడ్ ఇంతని, నైజాంకు ఇంత అడిగారని ఏవేవో నెంబర్లు బయట తిరుగుతున్నాయి. కొందరు ఏకంగా ఒక అడుగు ముందుకేసి తెలుగు రాష్ట్రాలకు కలిపి నూటా యాభై కోట్ల ధరకు హక్కులు పలికాయని కథనాలు వండేశారు. ఫ్యాక్ట్ ఏంటంటే అసలు వరప్రసాద్ వ్యాపారం ఇంకా మొదలుకాలేదు. నిర్మాత సాహు గారపాటి వద్దకు బిజినెస్ ఎంక్వయిరీలు వస్తున్నప్పటికీ ఆయన ఇప్పటికిప్పుడు క్లోజ్ చేయాలనే తొందరలో లేరని సమాచారం.

ఇటీవలే మీసాల పిల్ల సాంగ్ ప్రోమో వచ్చింది. కేవలం ముప్పై సెకండ్ల వీడియోకే పాజిటివ్, నెగటివ్ రెండు రకాల రెస్పాన్సులు వచ్చాయి. పాట రీచ్ అయ్యిందని చెప్పడానికి వేలాదిగా రీల్స్ సాక్ష్యంగా కనిపిస్తున్నాయి కానీ ఫుల్ వెర్షన్ వస్తే తప్ప స్టామినా ఏంటో అర్థం కాదు. ఇదిలా ఉండగా కీలకమైన షెడ్యూల్ ఒకటి పూర్తి చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నారు. వెంకటేష్ జాయిన్ అయ్యేది ఇందులోనే. ముఖ్యమైన ఎపిసోడ్స్ తో పాటు చిరు, వెంకీ కాంబలో పాటను తీయాలి. ఇది అయిపోతేనే అనిల్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది. అప్పటిదాకా దీనికి సంబంధించిన టెన్షన్ తప్పదు.

అందుకే టీజర్, ట్రైలర్ లాంటి యవ్వారాలు ఇంకా పెట్టుకోలేదు. నవంబర్ చివరి వారం కల్లా షూట్ పూర్తి చేసి డిసెంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు కేటాయించాలనేది అనిల్ ప్లాన్. దానికి పరిస్థితులు సహకరించాలి. పబ్లిసిటీ ఎలా చేయాలనే దాని మీద క్లారిటీతో ఉన్నారు కానీ ముందైతే ఫుల్ కంటెంట్ రెడీ అవ్వాలి. సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈసారి చిరు అనిల్ కు ఓపెనింగ్స్, వసూళ్లు అంత ఈజీగా ఉండవు. సంక్రాంతికి వస్తున్నాం టైంలో గేమ్ చేంజర్ డిజాస్టర్, డాకు మహారాజ్ యావరేజ్ ఫలితం కలిసొచ్చాయి. ఈసారి అలా ఎక్స్ పెక్ట్ చేయకుండా సాలిడ్ కంటెంట్ తో కొట్టి చూపించాల్సిందే.