సుజిత్ చెప్పినవన్నీ నిజమే అయితే

ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు సుజిత్ ప్రస్తుతం డల్లాస్ ట్రిప్ లో ఉన్నాడు. సినిమా ప్రమోషన్ల కోసం తమన్ తో కలిసి వెళ్లి అభిమానులను కలుసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఓజి సీక్వెల్, ప్రీక్వెల్ వరసగా వస్తాయని, అంతే కాదు ఇప్పుడు నానితో చేస్తున్న యాక్షన్ మూవీ కూడా సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఉంచాలా వద్దా అని అడగడంతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల చప్పట్లతో ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఓజి పార్ట్ వన్ కేవలం ఒక శాంపిల్ మాత్రమే అని చెబుతున్న సుజిత్ అసలైన మాస్ ర్యాంపేజ్ ఇకపై చూస్తారనే రీతిలో సంకేతాలు ఇచ్చాడు.

సినిమా బాగా ఆడుతున్న ఎగ్జైట్ మెంట్ లో ఉన్న ఫ్యాన్స్ కి ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాప్రాక్టికల్ గా చూసుకుంటే ఎప్పటికి అయ్యెనో అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది వేసవి లోగా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఎవరికీ కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. నిర్మాత రామ్ తాళ్ళూరికి ఇచ్చిన మాట ఇంకా నెరవేర్చాల్సి ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇంతకు ముందు ఆఫీస్ కూడా ప్రారంభించారు. తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. వకీల్ సాబ్ తర్వాత మరో సినిమా చేయాలని దిల్ రాజు కూడా ట్రై చేస్తూనే ఉన్నారు. సరైన కథ కాంబినేషన్ రెండూ దొరకాలంతే.

ఒకవేళ ఓజి ఇంకో రెండు భాగాలు చేయాలంటే అవి నిర్మాత డివివి దానయ్యకే ఇవ్వాలి. కానీ పవన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే ప్రొడ్యూసర్ కు అన్నేసి డేట్లు ఇచ్చే పరిస్థితిలో లేరు. పవన్ కొనసాగింపు మీద ఉత్సాహంగానే ఉన్నారు కానీ రాజకీయ క్షేత్రంలో బిజీ అయ్యాక ఏ క్షణమైనా మనసు మారొచ్చు కాబట్టి నిజంగా ఓజి 2, 3 వస్తాయా లేదాని ఇప్పటికిప్పుడు గ్యారెంటీగా చెప్పలేం. గత కొన్నేళ్లలో దేనికీ కనిపించనంత ఉత్సాహంగా పవన్ ఓజి విషయంలోనే కనిపించిన మాట నిజం. అది కనక మనసులో అలాగే ఉంటే మాత్రం సీక్వెల్స్ కి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఎప్పుడంటే మాత్రం సస్పెన్సే.