హైదరాబాద్ వివాదం… విజయవాడలో పరిష్కారం?

ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిధిగా విచ్చేసిన కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పూర్తి కన్నడలో మాట్లాడ్డం, సోషల్ మీడియాలో వివాదానికి దారి తీయడం చూస్తున్నాం. అది ఏకంగా బాయ్ కాట్ కాంతార అని పిలుపు ఇచ్చే దాకా వెళ్లిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తన ఉద్దేశంలో తప్పు లేకపోవచ్చు కానీ భాషని ఎంచుకోవడంలో చేసిన పొరపాటు వల్ల ఏకంగా ఓపెనింగ్స్ మీద ప్రభావం పడేలా చేసింది. పైగా ఏపీ ప్రభుత్వం కాంతార టికెట్ ధరల పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరో రకమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇదంతా అర్జెంట్ గా రిపేర్ చేయాల్సిన డ్యామేజ్.

ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడలో జరగబోయే ఈవెంట్ లో మరోసారి రిషబ్ శెట్టి మాట్లాడబోయే సందర్భం రానుంది. గొల్లపూడి ఎక్స్ పో గ్రౌండ్స్ లో జరగనున్న వేడుక ద్వారా రిషబ్ శెట్టి జరిగిన దానికి వివరణ ఇచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు రావడానికి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు తానెందుకు కేవలం కన్నడలోనే మొన్న ఈవెంట్ లో మాట్లాడాల్సి వచ్చిందో కొంచెం ఎక్స్ ప్లనేషన్ ఇవొచ్చు. నిజానికి రిషబ్ శెట్టికి ఓ మోస్తరుగా తెలుగు వచ్చు. ధారాళంగా కాకపోయినా కొద్దికొద్దిగా మాట్లాడగలడు. అది చాలు ఆడియన్స్ ని కూల్ చేయడానికి.

బజ్ ఎంత ఉందనేది పక్కన పెడితే కాంతార ఓపెనింగ్స్ సినిమా ఫలితంలో కీలక పాత్ర పోషించనున్నాయి. మొదటి భాగం టైంలో అంచనాలు లేవు. థియేటర్ బిజినెస్ తక్కువకు చేశారు. కన్నడ వెర్షన్ తో పోలిస్తే రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో రిలీయ్యింది. అయినా సరే బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. కానీ కాంతార చాప్టర్ 1 నాటికి లెక్కలు మారిపోయాయి. రేట్ అమాంతం పెరిగింది. మైత్రి సంస్థ హక్కులు సొంతం చేసుకుంది. ఏకంగా టికెట్ రేట్లు ఎక్కువ చేయమని అడిగే రేంజ్ లో ఉంది. సో ఈ ప్రశ్నలు అన్నింటికి కాకపోయినా కొన్నింటికి రిషబ్ శెట్టి వైపు సమాధానం వచ్చే ఛాన్స్ ఇవాళ ఉంది. చూద్దాం.