డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ‘టిల్లు స్క్వేర్’ ఏకంగా రూ.130 కోట్ల వసూళ్లు రాబట్టడంతో అతను మిడ్ రేంజ్ హీరోల లీగ్లో చేరిపోయాడు. దీంతో సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పెద్ద బడ్జెట్ పెట్టి అతడితో ‘జాక్’ సినిమా తీశాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
కానీ సినిమా ఆలస్యం కావడంతో నిర్మాత మీద భారం పెరిగింది. సినిమాకు అనుకున్నంత హైప్ కూడా రాలేదు. కష్టపడి సినిమాను రిలీజ్ చేశారు కానీ.. బాక్సాఫీస్ దగ్గర అది దారుణంగా బోల్తా కొట్టింది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దెబ్బకు ప్రసాద్ ప్రొడక్షన్ హౌస్ కుదేలైపోయింది. ఆయన్ని ఆదుకోవడానికి హీరో సిద్ధు కూడా ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో సిద్ధు.. ‘జాక్’ ఫలితం గురించి మాట్లాడాడు. ఆ సినిమా తమకు తీవ్ర నిరాశ కలిగించిన విషయం ఒప్పుకుంటూ.. తన వైపు నుంచి నిర్మాతకు చేసిన సాయం గురించి వెల్లడించాడు. తన పారితోషకంలో కోత పెట్టుకుని రూ.4.75 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు చెప్పాడు. ఐతే వెనక్కి ఇవ్వడానికి ఇంత మొత్తం తన దగ్గర లేవని.. దీంతో బ్యాంకు లోనుకు వెళ్లాల్సి వచ్చిందని సిద్ధు వెల్లడించాడు. ఇప్పుడు తన తర్వాతి చిత్రాలతో ఆ అప్పు తీర్చే పనిలో ఉన్నానని సిద్ధు తెలిపాడు.
బహుశా ‘జాక్’ కోసం తీసుకున్న పారితోషకాన్ని సిద్ధు ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఏదైనా ప్రాపర్టీ అయినా కొని ఉండొచ్చు. చేతిలో డబ్బులు లేకపోయినా.. ఇలా బ్యాంక్ లోన్ పెట్టి మరీ నిర్మాతను ఆదుకోవడం అంటే గొప్ప విషయమే. సిద్ధు గురించి ఫిలిం ఛాంబర్కు చెందిన ఒక వ్యక్తి ఆ మధ్య పరోక్షంలో ఒక ప్రెస్ మీట్లో అవాకులు చెవాకులు పేలడం చర్చనీయాంశం అయింది. కానీ సిద్ధు పెద్ద మనసేంటన్నది ఈ ఇంటర్వ్యూలో అందరికీ అర్థం అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates