సినిమాలు వదిలేసినందుకు బాధ లేదు


రెండు భాషల్లో పేరున్న హీరోల సరసన అవకాశాలు.. మంచి ఊపు మీద కెరీర్.. చివరగా నటించిన సినిమాలో తాను చేసిన పాత్రకు గొప్ప ప్రశంసలు.. ఇలా కెరీర్ నడుస్తున్న హీరోయిన్ ఉన్నట్లుండి సినిమాలు మానేస్తుందా? తనకు సినిమాల కంటే చదువే ముఖ్యం అని ఫారిన్‌కు వెళ్లిపోతుందా? బహుశా ఇంతకుముందు ఏ హీరోయిన్ విషయంలోనూ ఇలా జరిగి ఉండదేమో. కానీ బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ ఇదే చేసింది.

తెలుగులో లీడర్, బాయ్, మిరపకాయ్ లాంటి సినిమాల్లో నటించి.. ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోల సరసన నటించిన రిచా.. తొమ్మిదేళ్ల కిందట ఉన్నట్లుండి సినిమాలు వదిలేసింది. ధనుష్ సరసన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేసిన ‘మయక్కం ఎన్నా’నే ఆమె చివరి సినిమా. ఆ సినిమా మంచి విజయం సాధించింది. రిచాకు మంచి పేరూ తెచ్చిపెట్టింది.

కానీ ఆ సమయంలోనే ఎంబీఏ చేయడం కోసం సినిమాలు వదిలేసి యుఎస్ వెళ్లిపోయింది రిచా. అక్కడే తన క్లాస్ మేట్ అయిన యుఎస్ సిటిజన్‌తో ప్రేమలో పడి కొన్నేళ్ల కిందట అతణ్ని పెళ్లి కూడా చేసుకుంది. ఐతే ‘మయక్కం ఎన్నా’ విడుదలై తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో తాజాగా రిచా తన సినీ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోవడం గురించి మాట్లాడింది. మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయాలన్నది తన కల అని.. దానికి అదే సరైన సమయం అనిపించి సినిమాలు వదిలేశానని.. అలా తన రీల్ లైఫ్‌కు తెర పడిందని.. దీని గురించి తనకు ఎంతమాత్రం చింత లేదని చెప్పింది.

నటి కావడం వల్ల చాలామంది స్నేహితులకు తాను దూరం అయ్యానని.. ఎంబీఏ చేరాక మళ్లీ స్నేహితులందరినీ కలుసుకునే అవకాశం లభించిందని.. అలాగే తన జీవిత భాగస్వామి కూడా ఎంబీఏలోనే దొరికాడని రిచా చెప్పింది. ప్రస్తుత తన జీవితం పట్ల పూర్తి సంతోషంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేసింది.