టికెట్ల వేలం… వెర్రిగా మారకపోతే చాలు

ఓజి విడుదల ఇంకో తొమ్మిది రోజుల్లో ఉన్న నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఓ స్థాయిలో ఉండేలా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రీమియర్ షో మొదటి టికెట్ వేలం పేరుతో మొదలుపెట్టిన ట్రెండ్ క్రమంగా వేరే దారిలో వెళ్లి నెగటివిటీ తెచ్చే రిస్క్ కనిపిస్తోంది. యుఎస్ కి చెందిన ఒక ఎన్ఆర్ఐ ఫస్ట్ షో టికెట్ ని అయిదు లక్షలకు పాడుకున్నాడట. మంచిదే. దీన్ని జనసేనకు విరాళంగా ఇచ్చారు. ఇంకా సంతోషం. హైదరాబాద్ విశ్వనాథ్ థియేటర్ టికెట్ కోసం ట్విట్టర్ స్పేస్ లో వేలం పెట్టి లక్షకు అమ్మారట. దీని ఉద్దేశం కూడా డొనేషనే. తాజాగా తెనాలిలో యాభై వేల నుంచి పాట మొదలుపెట్టి అమ్మకం చేసే ఆలోచనలో ఉన్నారట.

వినడానికి ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ ఫ్యాన్స్ ఆలోచించాల్సిన కోణం మరొకటి ఉంది. ఇలా ఒక్కో ఊరిలో ప్రీమియర్ ఫస్ట్ టికెట్ పేరుతో వేలాలు నిర్వహించుకుంటూ పోతే రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది కలగొచ్చు. ప్రత్యర్థులు దీన్నో అస్త్రంగా వాడుకుని సినిమా టికెట్ల వేలాన్ని తమ అనుకూల ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. నిజంగా విరాళాలు ఇవ్వాలనుకుంటే నేరుగా జనసేనకే ఇచ్చి పవన్ తో ఫోటో దిగితే అయిపోతుంది. దానికి ఓజిని వాడుకోవడం మిస్ ఫైరయ్యే ఛాన్స్ లేకపోలేదు. సోషల్ మీడియాలో టాపిక్ గా నిలవడం కోసం ఇలాంటివి చేస్తున్నారనే కామెంట్స్ లేకపోలేదు.

అసలేం చేయకపోయినా ఓజికి అవసరానికి మించిన బజ్ ఇప్పటికే ఉంది. దాన్ని ఋజువు చేయడం కోసం ఒక్కో ఏరియా మెల్లగా ఇలా టికెట్ వేలం పెట్టుకుంటూపోవడం ఏమిటనే పాయింట్ తలెత్తుతుంది. ఆ మాటకొస్తే ఇది లీగల్ గానూ కరెక్ట్ కాదు. అందుకే ఒకటికి పదిసార్లు అలోచించి అడుగులు వేయడం బెటర్. ఇంకా స్పెషల్ షోలకు సంబంధించి అనుమతులు రాలేదు. హరిహర వీరమల్లుకి వచ్చాయి కాబట్టి ఓజికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కాకపోతే వాటికి టికెట్ రేట్లు ఎంత పెడతారనేది అసలు ప్రశ్న. ఇంకో నాలుగైదు రోజుల్లో ట్రైలర్ తో పాటు వీటికి సమాధానం రాబోతోంది. చూద్దాం.