సోలో రిస్కే సో బెటర్‍

చెప్పుకోతగ్గ చాలా సినిమాలు సంక్రాంతి రిలీజ్‍కి క్యూ కడుతోంటే సాయి ధరమ్‍ తేజ్‍ మాత్రం అంతవరకు ఆగకుండా డిసెంబరులోనే రిస్క్ చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబరులో ప్రతిరోజూ పండగే లాంటి హిట్టొచ్చింది కాబట్టి ఈసారి కూడా అదే సెంటిమెంట్‍ ఫాలో అవుతున్నాడు. ఇన్ని నెలల తర్వాత థియేటర్లలో విడుదలయ్యే సినిమా కనుక కరోనా భయం లేని వారంతా థియేటర్లకు వచ్చేస్తారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒకవేళ ఈ చిత్రానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో రాకపోయినా కానీ నష్టం లేదు. ఎందుకంటే ఈ చిత్రం సర్వ హక్కులను జీ సంస్థ ముందే కొనేసింది.

ఓటిటిలో విడుదల చేసే ముందు ప్రయోగాత్మకంగా థియేటర్లలో విడుదల చేస్తోంది. థియేటర్లలో విడుదల చేసిన రెండు, మూడు వారాలకే ఓటిటి రిలీజ్‍ కూడా వుంటుంది. అయితే మిగతా అందరిలా సంక్రాంతి వరకు వేచి చూడవచ్చు కానీ అసలే సగం టికెట్లు అమ్మాల్సిన టైమ్‍లో అన్ని సినిమాలతో పోటీ పడడం కంటే ఇప్పుడు అందుబాటులో వున్న అన్ని థియేటర్లలో విడుదల చేసుకుంటే మంచిదని ఇలా రిస్క్ చేస్తున్నారు. ఒకవేళ ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగానే వచ్చారనిపిస్తే మరికొన్ని సినిమాలను జనవరి 1కి విడుదల చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్‍లో అంటున్నారు.