నిధిని వెంటాడుతున్న బ్యాడ్ లక్

అందం కావాల్సినంత ఉన్నా అదృష్టం మాత్రం ఆమడదూరంలో ఆగిపోతోంది నిధి అగర్వాల్ కు. హరిహర వీరమల్లు తనకో పెద్ద బ్రేక్ గా నిలిచి అవకాశాలు తెస్తుందని ఆశపడితే, మొదటిసారి పవన్ కళ్యాణ్ తో జత కట్టిన అనుభవం చేదు ఫలితాన్నే ఇచ్చింది. పోనీ తనకేదైనా గుర్తింపు వచ్చి ఉంటే ఏదో అనుకోవచ్చు. అదీ లేదు. పాత్ర పరంగా ట్విస్టులైతే ఉన్నాయి కానీ అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. తాజాగా బ్లాక్ బస్టర్ అయిన మిరాయ్ లో స్పెషల్ సాంగ్ చేస్తే అది ఫ్లోకు అడ్డమవుతుందని ఎడిటింగ్ లో తీసేశారు. అడిగితే పార్ట్ 2 లో పెడతామని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అంటున్నారు.

ఒక్క పాటనే అయినా మిరాయ్ లో భాగం కావడం తనకో స్పెషల్ మెమరీగా ఉండిపోయేది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. మిరాయ్ 2 ఇప్పుడప్పుడే రాదు. తేజ సజ్జ ముందు జాంబీ రెడ్డి 2 పూర్తి చేయాలి. అదేమో 2027లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మిరాయ్ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్తుంది. ఆ టైంకి స్క్రిప్ట్ లో ఏమేం మార్పులు జరుగుతాయో, అప్పటికి ఆ పాట అవసరం కథలో ఉంటుందో లేదో ఇప్పటికి చెప్పలేం. ఇదొక ట్విస్టు అయితే వైబ్ ఉందిలే సాంగ్ కూడా తీసేశారు. ఒకవేళ ఓ పది రోజుల తర్వాత జోడించాలనుకుంటే ముందు దీన్నే చేస్తారు. మరి నిధి ఆటాపాటాను ఏం చేస్తారో చూడాలి.

నెక్స్ట్ నిధి అగర్వాల్ ఆశలన్నీ రాజా సాబ్ మీదే ఉన్నాయి. జనవరిలో విడుదల కాబోతున్న ఈ హారర్ డ్రామాకు అతి పెద్ద ఆకర్షణ ప్రభాస్. సినిమా కనక హిట్టయితే నార్త్ తో సహా ప్యాన్ ఇండియా స్థాయిలో నిధికి గుర్తింపు వస్తుంది. ఆ నమ్మకంతోనే వీరమల్లు, రాజా సాబ్ చేస్తున్నప్పుడు వేరే సినిమాలకు డేట్లు ఇవ్వలేదు. వాటిలో ఒకటి నీరు గార్చేసింది. ఇప్పుడు ఆ బాధ్యత ప్రభాస్ మీద ఉంది. నిధి అగర్వాల్ తో పాటు మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన రాజా సాబ్ లో ఇద్దరికీ ఎంతెంత స్పేస్ దక్కిందనేది వేచి చూడాలి. ఇంకో నాలుగు నెలలు టైం ఉంది కాబట్టి అభిమానులు రిలాక్స్ అవ్వొచ్చు.