శర్వానంద్ చడీచప్పుడు లేకుండా..

ఒక దశలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి సూపర్ హిట్లతో మాంచి ఊపుమీదున్నాడు శర్వానంద్. అతడి మార్కెట్ అమాంతం పెరిగింది. కానీ ఆ సక్సెస్ స్ట్రీక్‌ను తర్వాత కొనసాగించలేకపోయాడు. మారుతితో చేసిన ‘మహానుభావుడు’ మినహాయిస్తే గత కొన్నేళ్లలో శర్వా స్థాయికి తగ్గ విజయాల్లేవు.

చివరగా అతడి నుంచి వచ్చిన జాను, పడి పడి లేచె మనసు పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఇప్పుడు శర్వాకు అత్యవసరంగా ఓ హిట్టు అవసరం. ఆ విజయం ఏది అందిస్తుందో కానీ.. శర్వా మాత్రం యమ స్పీడుగా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఇప్పటికే శర్వా తెలుగులో ‘శ్రీకారం’ అనే సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కిషోర్ అనే కొత్త దర్శకుడు ఆ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం మొదలైంది గత ఏడాదే కానీ.. మధ్యలో కరోనా వల్ల కొంచెం ఆలస్యమైంది.

ఇక శర్వా లాక్ డౌన్ తర్వాత మొదలుపెట్టిన ఓ కొత్త చిత్రం ఇంతలోనే పూర్తయిపోవడం విశేషం. తమిళంలో నిర్మాతగా చాలా మంచి పేరున్న ఎస్.ఆర్.ప్రభు ‘డ్రీమ్ వారియర్స్’ బేనర్ మీద తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇంతకుముందు శర్వా తమిళంలో ‘జర్నీ’ సినిమాతో చాలా మంచి పేరే సంపాదించాడు. కానీ ఆ తర్వాత ఆ మార్కెట్ మీద దృష్టిపెట్టలేదు. ఇంత కాలానికి ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు.

ఈ సినిమాలో సీనియర్ నటి అమల ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా.. రీతూ వర్మ కథానాయికగా నటించింది. వీళ్లిద్దరికీ తమిళంలో మంచి గుర్తింపే ఉంది. తెలుగు వెర్షన్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో మాటలు రాస్తున్నది దర్శకుడు తరుణ్ భాస్కర్ కావడం విశేషం. కొత్త ఏడాదిలో వీలు చూసుకుని ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.