దక్షిణ భారతీయులకి మల్లెపూలంటే ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. ప్రతి పండుగ, వేడుక, రోజువారీ జీవితంలోనూ మహిళలు జుట్టులో మల్లెపూలు ధరించడం ఆనవాయితీ. కానీ ఈ సాంప్రదాయ అలవాటు ఆస్ట్రేలియాలో ఒక పెద్ద సమస్యగా మారింది. మలయాళ నటి నవ్యా నాయర్ తాజాగా దీనికి ఉదాహరణ అయ్యారు. మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె దగ్గర 15 సెంటీమీటర్ల పొడవు గల మల్లె గజ్రా ఉన్నందుకు అధికారులు రూ.1.14 లక్షల జరిమానా వేశారు.
నవ్యా ఆస్ట్రేలియాలోని మలయాళీ సంఘం నిర్వహించిన ఓనమ్ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళారు. బయలుదేరే ముందు ఆమె తండ్రి మల్లెపూలు కొనిచ్చి, “కోచి నుంచి సింగపూర్ వరకు ఒక భాగం వాడుకో, మిగతావి హ్యాండ్బ్యాగ్లో పెట్టుకో” అని ఇచ్చారు. అదే మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. “నేను చేసినది చట్టానికి విరుద్ధమని అక్కడే తెలిసింది. అనుకోకుండా చేసినా తప్పే అని అధికారులు చెప్పారు. జరిమానా 28 రోజుల్లో చెల్లించాల్సిందే అన్నారు” అని నవ్యా వెల్లడించారు.
ఇక ఆస్ట్రేలియా బయోడైవర్సిటీ రూల్స్ ప్రకారం, పూలు, పండ్లు, విత్తనాలు, మొక్కల వేర్లు వంటి వాటిని బయట నుంచి దేశంలోకి తీసుకెళ్లరాదు. అవి స్థానిక పర్యావరణానికి హాని కలిగించే అవకాశముందని భావిస్తారు. అందుకే చిన్న గజ్రా ఉన్నా జరిమానా తప్పదని అధికారులు చెబుతున్నారు.
ఆకస్మిక జరిమానా ఆమెను షాక్కు గురిచేసినా, ఓనమ్ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. మెల్బోర్న్లో జరిగిన వేడుకల్లో పాల్గొని అభిమానులతో ఫోటోలు పంచుకున్నారు. “ఆకాశంలోనే నా మొదటి తిరువోణం జరుపుకున్నా” అంటూ సోషల్ మీడియాలో రీల్ కూడా పోస్ట్ చేశారు. నవ్యా నాయర్ 2001లో ఇష్టం సినిమాతో పరిచయం అయ్యారు. తరువాత నందనం, కళ్యాణరామన్, మజతుల్లిక్కిలుక్కం, వెల్లితీర వంటి అనేక హిట్ చిత్రాలతో మలయాళ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. రెండు సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. తమిళం, కన్నడలోనూ నటించి మంచి పేరుపొందారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates