మొన్న ఇర్ఫాన్.. నిన్న రిషి.. నేడు ఆయన

2020 సినీ ఇండస్ట్రీకి వేల కోట్ల సినీ పరిశ్రమకు అత్యంత విషాదకరమైన సంవత్సరంగా మిగలబోతోంది. కరోనా ధాటికి సినీ కార్మికులంతా అల్లాడిపోతున్నారు. వేల కోట్ల నష్టం ఎదురవుతోంది. ఐతే ఇదంతా ఒక ఎత్తయితే.. బాలీవుడ్లో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ఆ పరిశ్రమను మరింత కుంగదీస్తున్నాయి.

మొన్న భారత దేశం గర్వించదగ్గ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్‌తో కన్నుమూశాడు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే.. ఇంకో 24 గంటల్లోనే మరో లెజెండరీ నటుడు రిషి కపూర్ కూడా క్యాన్సర్‌తోనే మరణించారు.

ఇంకో 24 గంటలు తిరిగేసరికి మరో ప్రముఖుడిని బాలీవుడ్ కోల్పోయింది. ఆయన పేరు.. కుల్మీత్ మక్కర్. ఈయన ఇండియన్ ఫిలిం, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సీఈవోగా పని చేస్తున్నారు. నిర్మాత కూడా అయిన కుల్మీత్ గురించి సామాన్య జనానికి పెద్దగా తెలియదు. కానీ బాలీవుడ్ వర్గాల్లో మాత్రం కుల్మీత్ బాగా ఫేమస్.

మన దగ్గర దిల్ రాజు నేతృత్వంలో ఏర్పాటైన ప్రొడ్యూసర్స్ గిల్డ్ లాంటిది బాలీవుడ్ వాళ్లు ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నారు. అది చాలా చురుగ్గా పని చేస్తోంది కూడా. దాన్ని చాలా ఏళ్లుగా నడిపిస్తున్నది కుల్మీతే. ఆయనకు బాలీవుడ్ వర్గాల్లో మంచి పేరుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్న కుల్మీత్‌కు ఈ రోజు ఉదయం హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచారు.

కరణ్ జోహార్, ఫర్హాన్ అక్తర్ సహా పలువురు అగ్ర నిర్మాతలు కుల్మీత్ హఠాన్మరణంపై షాకవుతూ మెసేజ్‌లు పెట్టారు. ప్రతి రోజూ ఉదయం ఒక ఘోరమైన వార్తతో నిద్ర లేవాల్సి వస్తోందని.. సినీ పరిశ్రమకు కుల్మీత్ చేసిన సేవలు అపారమని కరణ్, ఫర్హాన్ పేర్కొన్నారు.

ఇంకోవైపు మరో బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్‌కు కూడా సీరియస్‌గా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగ్గా.. ఆ వార్తలు అబద్ధమని, తాను క్షేమంగానే ఉన్నానని ఆయన స్పష్టత ఇచ్చారు.