మురుగదాస్ టైం వేస్ట్ చేయించిన సినిమా

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు మురుగదాస్. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్‌బస్టర్లు ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. హిందీలో ‘గజిని’ సినిమాను రీమేక్ చేస్తే అక్కడా రికార్డ్ బ్రేకింగ్ హిట్టయింది. కానీ గత దశాబ్ద కాలంలో మురుగదాస్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ‘స్పైడర్’ దగ్గర్నుంచి అన్నీ పరాజయాలే.

ఈ మధ్య ఆయన సినిమాల ఫ్రీక్వెన్సీ కూడా బాగా తగ్గిపోయింది. 2020లో సూపర్ స్టార్ రజినీకాంత్‌ మూవీ ‘దర్బార్’తో పలకరించిన ఆయన.. ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఈ ఏడాది ఆరంభంలో ఆయన్నుంచి ‘సికిందర్’ సినిమా వచ్చింది. ఇప్పుడు శివకార్తికేయన్ చిత్రం ‘మదరాసి’తో వస్తున్నాడు మురుగదాస్. తన కెరీర్లో ఇంత గ్యాప్ రావడానికి ఒక యానిమేషన్ మూవీయే కారణమని మురుగదాస్ తెలిపాడు.

‘దర్బార్’ కంటే ముందు నుంచి ఒక పెద్ద యానిమేషన్ మూవీ మీద పని చేస్తున్నాడట మురుగదాస్. దాని కోసం చాలా కష్టపడ్డానని.. కానీ చివరికి ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని మురుగదాస్ తెలిపాడు. ఆ సినిమా వల్ల దాదాపు ఐదు సంవత్సరాల సమయం వృథా అయిందని మురుగదాస్ తెలిపాడు.

ఇక మదరాసి సినిమా గురించి మురుగదాస్ మాట్లాడుతూ.. దక్షిణాది వాళ్లందరినీ నార్త్ వాళ్లు మదరాసి అని పిలుస్తుంటారని.. ఈ చిత్రంలో విలన్ కూడా హీరోను అలాగే సంబోధిస్తాడని.. అందుకే ఈ టైటిల్ ఖరారు చేశామని చెప్పాడు. మన దేశంలోకి వస్తున్న ఒక కొత్త సమస్యను ఈ చిత్రంలో చర్చించామని.. ఆ పాయింటే సినిమాకు హైలైట్‌గా ఉంటుందని అన్నాడు. హీరోతో పాటు హీరోయిన్, విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయని.. సినిమాలో నాన్ స్టాప్ యాక్షన్ ఉంటుందని మురుగదాస్ తెలిపాడు.