నిర్మాణ సంస్థను మూసేస్తున్న దర్శకుడు

ప్రమాణాలు పడిపోయిన తమిళ ఫిలిం ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాల్లో వచ్చిన మేటి దర్శకుల్లో ఒకడిగా వెట్రిమారన్‌ను చెప్పొచ్చు. తొలి చిత్రం ‘పొల్లాదవన్’తో మొదలుపెడితే ఆడుగళం, విసారణై, వడ చెన్నై అసురన్, విడుదల.. ఇలా వెట్రిమారన్ ప్రతి చిత్రం ఒక కళాఖండమే. దర్శకుడిగా మంచి పేరు వచ్చాక అతను నిర్మాతగా కూడా మారాడు.

గ్రాస్ రూట్ ఫిలిమ్ కంపెనీ సంస్థలో రెండంకెల సంఖ్యలో సినిమాలు నిర్మించాడు. ఈ సంస్థలో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్లే. అయినా సరే.. వెట్రిమారన్ తన ప్రొడక్షన్ హౌస్‌ను మూసేయాలనే కఠిన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నిర్మాతగా ఒత్తిడిని తట్టుకోవడం కష్టంగా ఉందని.. అందుకే ప్రొడక్షన్ ఆపేస్తున్నానని అతను ప్రకటించాడు. వెట్రిమారన్ సంస్థ నుంచి రానున్న చివరి చిత్రం.. బ్యాడ్ గర్ల్. ఆ చిత్రం సెప్టెంబరు 5న రిలీజ్ కాబోతోంది.

వెట్రిమారన్ తన ప్రొడక్షన్లో కొన్ని రెవల్యూషనరీ ఫిలిమ్స్ నిర్మించాడు. వాటి వల్ల వివాదాలు తప్పలేదు. ముఖ్యంగా ఒక టీనేజీ అమ్మాయి రొమాంటిక్ ఫాంటసీల చుట్టూ తిరిగే ‘బ్యాడ్ గర్ల్’ ప్రోమోలు తీవ్ర విమర్శలకు దారి తీసి.. విడుదల బాగా ఆలస్యం అయింది. మరోవైపు ఆండ్రియా జెరెమీ ప్రధాన పాత్ర పోషించిన ‘మానుషి’ మరింత వివాదాస్పదమైంది. ఆ సినిమాపై యాంటీ నేషనల్ ముద్ర పడడంతో విడుదలకు అడ్డంకులు తప్పలేదు. 

కోర్టు కేసుల్లో చిక్కుకున్న సెన్సార్‌ బోర్డు ఆ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ రెండు చిత్రాలూ వెట్రిమారన్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఆర్థికంగా తలెత్తే ఇబ్బందులకు తోడు దర్శకుడిగా ఆయన చేసే సినిమాల మీద వీటి ప్రభావం పడుతోంది. అందుకే ఈ తలనొప్పులన్నీ ఎందుకు అని ఆయన తన నిర్మాణ సంస్థనే మూసేస్తున్నట్లు ప్రకటించాడు. త్వరలో శింబుతో వెట్రి ‘వడ చెన్నై’ తరహా రా అండ్ రస్టిక్ ఫిలిం తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.