బెల్లంకొండ సినిమా వాయిదా.. కానీ

తెలుగులో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడూ విజయాలు అందుకుంటూ కెరీర్‌ను బాగానే ముందుకు తీసుకెళ్లాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ మధ్యలో ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్‌లో నటించడం తన కెరీర్‌కు పెద్ద డ్యామేజీ అయింది. ఆ సినిమా హిందీలో సరిగా ఆడలేదు. పైగా తెలుగులో బాగా గ్యాప్ వచ్చింది. ఈ విరామం తర్వాత ‘భైరవం’ చిత్రంలో నటిస్తే అది నిరాశపరిచింది. ఐతే తన కొత్త చిత్రం ‘కిష్కింధపురి’ మీద బెల్లంకొండ శ్రీనివాస్ చాలా నమ్మకంగా ఉన్నాడు. కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’ సినిమా తీసిన కౌశిక్ పెగల్లపాటి ఈ చిత్రాన్ని రూపొందించాడు.

ఇది డివైన్ ఎలిమెంట్స్‌తో ముడిపడ్డ ఫాంటసీ హార్రర్ మూవీ. దీని టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. ‘రాక్షసుడు’ తర్వాత శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన చిత్రమిది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 12న ‘కిష్కింధపురి’ రిలీజ్ కావాలి. ఐతే అదే రోజు ‘మిరాయ్’ భారీ అంచనాల మధ్య రిలీజవుతుండడంతో దానికి పోటీగా వెళ్లకపోవడం మంచిదే అన్న సందేహాలు కలిగాయి.

రిలీజ్ డేట్ మార్చక తప్పదని అనుకున్నారు. ఆ ప్రకారమే ‘కిష్కింధపురి’ వాయిదా పడింది. అలా అని వారం, రెండు వారాలేమీ పోస్ట్ పోన్ చేయలేదు. ఒక్క రోజు ఆలస్యంగా సెప్టెంబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 13న అన్నది హార్రర్ చిత్రాలకు సెంటిమెంటుగా కలిసొచ్చే డేట్. హార్రర్ చిత్రాల టైటిళ్లు కూడా ఈ నంబర్‌తో పెడుతుంటారు. ‘13 బి’ అందుకు ఉదాహరణ. ‘మిరాయ్’తో పోటీ మంచిది కాదని, సెంటిమెంటుగా కూడా కలిసొస్తుందని 13ను రిలీజ్ డేట్‌గా ఎంచుకున్నట్లున్నారు. 12న రావాాల్సిన మరో చిత్రం ‘కాంత’ ఆ వీకెండ్ నుంచి వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. ‘కిష్కింధపురి’కి సామ్ సీఎస్, చేతన్ భరద్వాజ్ సంగీతాన్నందించగా.. షైన్ స్క్రీన్స్ అధినే సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశాడు.