మెగా అల్లు బంధం మీద సందేహాలొద్దు

స్వర్గీయ అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నం కన్నుమూయడం ఈ కుటుంబంతో పాటు మెగా ఫ్యామిలీలోనూ తీరని విషాదం రేపింది. బన్నీ నాన్నమ్మ, చరణ్ అమ్మమ్మ, చిరంజీవి అత్తయ్య, అల్లు అరవింద్ అమ్మ ఇలా కిరీటాల్లాంటి బంధుత్వాలు ఉన్న పెద్దావిడ 94 ఏళ్ళ వయసులో సంపూర్ణ జీవితాన్ని చూశారు. కన్న బిడ్డలతో పాటు ముని మనవళ్లు, మనవరాళ్లను చూసుకునే భాగ్యం అందుకున్నారు. చివరి చూపుని ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ నివాసంలో ఈ రోజు అభిమానులను కదిలించిన దృశ్యాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అవి అల్లు, మెగా కుటుంబాల మధ్య గ్యాప్ ఉందనే అపోహలను తొలగించేలా ఉన్నాయి.

వార్త తెలిసిన వెంటనే చిరంజీవి ఉన్నపళంగా అక్కడికి వెళ్ళిపోయి అన్ని దగ్గరుండి చూసుకోవడం, అల్లు అర్జున్ – రామ్ చరణ్ చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటూ జరగాల్సిన కార్యక్రమాల గురించి సీరియస్ గా చర్చించుకోవడం, మేనల్లుడిని అరవింద్ ఆప్యాయంగా హత్తుకుని ఓదార్చడం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ లు కలసి వచ్చి సంఘీభావం ప్రకటించడం లాంటివి వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పవన్ కళ్యాణ్ భార్య అన్నాతో బన్నీ భార్య స్నేహరెడ్డి తదితరులు ముచ్చటించుకోవడం ఫ్యాన్స్ దృష్టి దాటి పోలేదు. ఓసారి చరణ్ చేయి పట్టుకుని బన్నీ ఏదో పని మీద తీసుకెళ్లడం బాగా కనెక్ట్ అయ్యింది.

సో ఏదో జరిగిపోయింది, రెండు కుటుంబాల మధ్య పడటం లేదనే సందేహాలకు పుకార్లకు చెక్ పెడుతూ అందరూ కలిసి మెలిసి కనిపించారు. ఎంత విషాదం రేపిన సంఘటనే అయినా నిజంగా తీవ్ర విభేదాలు ఉంటే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉండేవారు. కానీ అలాంటి దాఖలాలు మచ్చుకు కూడా కనిపించలేదు. పైగా ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో గతంలో అల్లు అరవింద్ తీయాలన్న చరణ్ అర్జున్ ని ఇప్పుడు ప్లాన్ చేయమంటున్నారు. ఏదైతేనేం పెద్దావిడ వల్ల మెజారిటీ అభిమానుల్లో నెలకొన్న డౌట్లకు చరమగీతం పాడినట్టయ్యింది. మరి ఫ్యాన్స్ ఏం చేస్తారో చూడాలి.