రీ రిలీజుల బంగారు బాతుని చంపుతున్నారు

బంగారు గుడ్లు ఇచ్చే బాతుని అత్యాశతో చంపేసినట్టయ్యింది రీ రిలీజుల వ్యవహారం. అభిమానుల ఎమోషన్లను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో పదే పదే పాత సినిమాలను మళ్ళీ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ హద్దు మీరుతోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మూడు రోజుల ముందే తమ్ముడుని తీసుకొచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. చాలా సెంటర్లలో కనీసం క్యూబ్ ఖర్చులు రావడం అనుమానమే. ఈ పరిస్థితి కారణం పట్టుమని రెండేళ్లు తిరక్కుండానే తమ్ముడుని మరోసారి ఇప్పుడున్న టికెట్ రేట్లకే అభిమానులకు చూపించాలనుకోవడం.

నాగార్జున రగడ పరిస్థితి కూడా ఇంతకన్నా భిన్నంగా ఏమి లేదు. రీ రిలీజ్ మొదటిసారే అయినప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ సైతం దీని మీద ఆసక్తి చూపించలేదు. రెండు మూడు యాక్షన్ బ్లాక్స్, మూడు పాటలు తప్ప యావరేజ్ కంటెంట్ ఉన్న రగడ మీద జనాల్లో పెద్దగా ఇంటరెస్ట్ లేదు. పైగా శివ 4కె దగ్గరలో ఉండగా ఇప్పుడు రగడని తేవడం నాగ్ అభిమానులను ఇష్టం లేదు. దీంతో థియేటర్లకు దూరంగా ఉండిపోయారు. అత్యధిక షోలు క్యాన్సిలయ్యాయని సమచారం. ఆ మధ్య చిరంజీవి బర్త్ డేకి వదిలిన స్టాలిన్ ఇదే సిచువేషన్ ని చూసింది. క్రాస్ రోడ్స్ సింగల్ స్క్రీన్లు మినహాయించి మిగిలిన చోట సోసోనే.

కొంత కాలం వీటికి బ్రేక్ ఇవ్వడం అవసరం. కొత్త సినిమాలకు జనం రావడం మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో అదే పనిగా పాత హిట్లను ఇలా అరిగిపోయే దాకా రుద్దడం ఎంత మాత్రం సేఫ్ కాదు. నెక్స్ట్ ప్రభాస్ పౌర్ణమి లైన్ లో ఉంది. ఇది కూడా అప్పట్లో ఫ్లాప్ మూవీనే. ఈ నెల రెండో వారంలో వచ్చిన అతడు సైతం ఎలాంటి అద్భుతాలు చేయలేదు. కాకపోతే ఇప్పుడు చూస్తున్న ఫ్లాపుల కంటే మెరుగ్గా ఆడింది అంతే. రెండేళ్లుగా ఉదృతంగా నడిచిన ఈ ట్రెండ్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకున్నట్టే. శివ కనక బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ నమోదు చేయకపోతే వీటి కథ కంచికి జానాల ఆసక్తి ఇంటికి చేరుకుందని చెప్పొచ్చు.