ఆనంద్ హీరోయిన్ మ‌నసు విరిచేసిన తెలుగు సినిమా ఏది?

ఆనంద్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన బెంగాలీ భామ క‌మ‌లిని ముఖ‌ర్జీ.. ఆ చిత్రంతో ఎంత మంచి పేరు సంపాదించిందో తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా ఆమెకు గోదావ‌రి, గ‌మ్యం.. ఇలా ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. హీరోయిన్లు ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప‌రిమితం అయ్యే తెలుగు సినిమాల్లో ఇన్ని గొప్ప పాత్ర‌లు ఒక క‌థానాయిక చేయ‌డం అరుదైన విష‌యం. ఐతే కొన్నేళ్ల పాటు తెలుగులో హ‌వా సాగించిన క‌మ‌లిని.. ఉన్న‌ట్లుండి అంత‌ర్ధానం అయిపోయింది. చాలా ఏళ్లుగా ఆమె టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్ మీదే క‌నిపించ‌లేదు.

కానీ అదే స‌మ‌యంలో వేరే భాషా చిత్రాల్లో న‌టించింది. మ‌రి అవ‌కాశాలు రాక ఇక్క‌డ సినిమాలు చేయ‌లేదా.. లేక ఆమే దూర‌మైందా అన్న‌ది స్ప‌ష్ట‌త లేదు. ఐతే ఒక ఇంట‌ర్వ్యూలో క‌మ‌లిని స్వ‌యంగా ఈ సందేహాల‌కు స‌మాధానం ఇచ్చింది. ఒక సినిమాలో తాను చేసిన పాత్ర తాను ఊహించినంత బ‌లంగా, లోతుగా తెర‌పైకి రాలేద‌ని… ఆ క్యారెక్ట‌ర్ మిగిల్చిన నిరాశ‌, అసంతృప్తి వ‌ల్లే తాను తెలుగు సినిమాల‌కు దూరం అయ్యాన‌ని క‌మ‌లిని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఆ సినిమా ఏద‌న్న‌ది ఆమె బ‌య‌ట‌పెట్ట‌లేదు. చివ‌ర‌గా తెలుగులో క‌మ‌లిని న‌టించిన సినిమా.. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ రూపొందించిన గోవిందుడు అంద‌రివాడేలే.

ఈ చిత్రంలో శ్రీకాంత్ మ‌ర‌ద‌లిగా కీల‌క‌మైన పాత్ర‌లోనే న‌టించింది క‌మ‌లిని. కానీ ఆ సినిమా అనుకున్నంత పెద్ద విజయం ఐతే సాధించలేదు కానీ, హిట్ అనే ముద్ర ఐతే వేసుకుంది. మ‌రి క‌మ‌లినికి అసంతృప్తి మిగిల్చిన సినిమా ఇదేనా.. లేక మ‌రొక‌టా అన్న‌ది ఆమెనే చెప్పాలి. దీని కంటే ముందు క‌మ‌లినికి తెలుగులో ఫ్లాప్ మూవీస్ లేక‌పోలేదు. గోవిందుడు అంద‌రివాడేలే త‌ర్వాత ఆమె త‌మిళంలో ఇరైవి, మ‌ల‌యాళంలో పులి మురుగ‌న్ చిత్రాల్లో న‌టించింది. ఆ సినిమాలు విజ‌య‌వంతం అయ్యాయి. క‌మలిని న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కానీ ఆ త‌ర్వాత ఆ భాష‌ల్లో ఆమె సినిమాలు ద‌క్కించుకోలేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.