స్కూల్ పిల్లలతో హారర్ మూవీ ఏంటో

సినిమాలు పెద్దగా ఆడని గుజరాత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హారర్ మూవీ వష్. 2023లో రిలీజైన ఈ సినిమా అక్కడ కొత్త రికార్డులు నమోదు చేసింది. తక్కువ బడ్జెట్ లో తీసినా భారీ వసూళ్లతో ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. దీని విజయం ఏ స్థాయిలో ఉందంటే అజయ్ దేవగన్ ఏరికోరి మరీ సైతాన్ గా రీమేక్ చేసుకుని హిట్టు అందుకున్నాడు. ఇందులో మాధవన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఒక టీనేజ్ అమ్మాయిని వశీకరణ విద్య ద్వారా లోబరుచుకున్న మాంత్రికుడు అలాంటి ఎందరో అమాయకురాళ్ల జీవితాలతో ఆడుకుంటాడు. అతన్ని ఆ యువతి తండ్రి ఏం చేశాడనే పాయింట్ మీద వష్ రూపొందింది.

ఇప్పుడు దీనికి సీక్వెల్ వష్ లెవల్ 2 పేరుతో మొన్న విడుదలయ్యింది. రీమేక్ కి అవకాశం లేకుండా హిందీ డబ్బింగ్ కూడా ఒకేసారి రిలీజ్ చేశారు. కాకపోతే ఈసారి ఇంకొంచెం షాకింగ్ కంటెంట్ తీసుకున్నారు. పెద్ద స్కూల్ లో చదువుకునే పది మంది అమ్మాయిలు పాఠశాల టెర్రస్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఊరి మీద పడి దొరికినవాళ్లను దొరికినట్టుగా దారుణంగా చంపుతూ ఉంటారు. ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటారు. ఇదంతా చేస్తోంది వష్ మొదటి భాగంలో మాయమైన మాంత్రికుడి శిష్యుడని తెలుస్తుంది. ఆ తర్వాత అరిగే పరిణామాలు తెరమీదే చూడాలి.

కేవలం 1 గంట 35 నిమిషాల నిడివితో ఉన్న వష్ లెవల్ 2ని దర్శకుడు కృష్ణదేవ్ యాగ్నిక్ మొదటి భాగం స్థాయిలో కాకపోయినా దీన్ని కూడా ఇంటెన్స్ తో తెరకెక్కించారు. కొన్ని ఎపిసోడ్స్ నిజంగా ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తాయి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు చనిపోవడం, వాళ్ళతో చేయించిన హింస కొంచెం హద్దులు దాటిందనే చెప్పాలి. బుక్ మై షో ట్రెండింగ్ లో ఉన్న ఈ హారర్ డ్రామాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఇంత షాకింగ్ కంటెంట్ ని అజయ్ దేవగన్ లాంటి స్టార్లు రీమేక్ చేయకపోవడమే మంచిది. అన్నట్టు పార్ట్ 3కి లీడ్ కూడా ఇచ్చారు. అది ఇంకెంత భయంకరంగా ఉండబోతోందో వేరే చెప్పాలా.