రామ్ ఎంచుకున్నది మంచి డేటేనా

నిన్న ‘ఆంధ్రకింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నవంబర్ 28 థియేటర్లలో అడుగు పెడుతున్నట్టు ప్రకటించారు. నిజానికి దసరా లేదా దీపావళికి వస్తుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ అవి నెరవేరలేదు. పండగలకు విపరీతమైన పోటీ ఉంది. ప్యాన్ ఇండియా మూవీస్ క్యూ కట్టి ఉన్నాయి. వాటి మధ్యలో వస్తే అనవసరంగా నలిగినట్టు అవుతుంది. అందుకే సేఫ్ ఆప్షన్ ఎంచుకున్నారు. అయితే సరిగ్గా వారం తర్వాత డిసెంబర్ 5 రాజా సాబ్ ఉందనే టెన్షన్ రామ్ అభిమానుల్లో లేకపోలేదు. కానీ అది సంక్రాంతికి వెళ్తుందని నిర్మాతతో సహా అన్ని వర్గాలు సంకేతాలు ఇవ్వడంతో రూట్ క్లియరయ్యింది.

ఇప్పుడు ఖాళీ అవుతున్న డిసెంబర్ 5ని అఖండ 2 వాడుకుంటుందనేది ఇండస్ట్రీలో ఓపెన్ గా వినిపిస్తున్న టాక్. కానీ అసలు సెప్టెంబర్ 25 నుంచి తప్పుకున్నట్టు ఇప్పటిదాకా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అదే తేదీకి వస్తున్న ఓజి పబ్లిసిటీ ఇంకా వేగమందుకోలేదు. సో నిర్ణయాలు ఏ క్షణంలో ఎలా ఉండబోతున్నాయో అంతు చిక్కడం లేదు. అందుకే ఈ గొడవంతా లేకుండా శుభ్రంగా నవంబర్ 28కి వెళ్లిపోవడం అత్యుత్తమ నిర్ణయం. పోనీ ఇంకా ఆగుదామా అంటే క్రిస్మస్ నుంచి సంక్రాంతి దాకా సీజన్ మొత్తం ప్యాకైపోయింది. ఎక్కడా ఖాళీ లేదు. సో రామ్ ఎంచుకున్నది బెస్ట్ ఆప్షనే.

ఇంకొంచెం కీలక భాగం పెండింగ్ ఉన్న ఆంధ్రకింగ్ తాలూకాలో ఉపేంద్ర నిజ జీవిత హీరో పాత్రనే పోషిస్తుండగా అతన్ని విపరీతంగా ఆరాధించే వీర ఫ్యాన్ గా రామ్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఒక పాట చార్ట్ బస్టర్ అయ్యింది. వివేక్ మెర్విన్ కంపోజ్ చేసిన ట్యూన్ కి మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి స్పందన దక్కింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత దర్శకుడు మహేష్ బాబు కొంచెం మాస్ టచ్ ఉన్న డిఫరెంట్ సబ్జెక్టు ఎంచుకున్నాడు. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని, రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా రామ్ చేసిన ప్రయోగం మంచి ఫలితం ఇస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.