ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతులు.. రచ్చ రచ్చ

నందమూరి అభిమానుల్లో కొన్ని వర్గాలు ఏర్పడ్డాడయన్నది బహిరంగ రహస్యం. అందులో బాలకృష్ణ, ఎన్టీఆర్‌లిద్దరినీ సమానంగా అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. అదే సమయంలో బాలయ్యను మాత్రమే, తారక్‌ను మాత్రమే అభిమానించే వర్గాలూ తయారయ్యాయి. వీరి మధ్య చాన్నాళ్లుగా ఘర్షణ జరుగుతోంది. ఇక తెలుగుదేశం అభిమానుల్లో ఎక్కువమంది బాలయ్య వైపే ఉంటారు. ఆ వర్గం తారక్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. వీరితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ పడడం సోషల్ మీడియాలో కామన్. అప్పుడప్పుడూ గ్రౌండ్ లెవెల్లో కూడా వీరి మధ్య ఘర్షణ జరుగుతుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు తారక్‌ను ఉద్దేశించి తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు సంబంధించిన ఆడియో కాల్ లీక్ అయి.. ఆ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. తారక్ కొత్త చిత్రం ‘వార్-2’ గత గురువారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఓ మోస్తరు వసూళ్లతో రన్ అవుతోంది. ఐతే ఎవరో ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ సినిమాకు సిటీలో ఏయే థియేటర్లు ఇచ్చారని వాకబు చేశారు ప్రసాద్. ఈ క్రమంలో ఆ సినిమాకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అంటూ.. ఎన్టీఆర్‌ను ఉద్దేశించి బూతులు తిట్టారు ప్రసాద్.

సార్‌ను అంటాడా, లోకేష్‌ను అంటాడా ఆ ..కొడుకు.. అంటూ రాయలేని భాషలో బూతులు తిట్టారు ప్రసాద్. వైసీపీ వాళ్లకు ఈ ఆడియో ఒక ఆయుధంలా దొరికింది. దాన్ని వెంటనేే సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. అది విని తారక్ అభిమానులకు పట్టరాని కోపం వచ్చింది. సోషల్ మీడియాలో ప్రసాద్ మీద మండిపడుతున్నారు. అంతే కాక అనంతపురం సిటీలో పెద్ద ఎత్తున తారక్ అభిమానులు రోడ్ల మీదికి వచ్చి ప్రసాద్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదులపెట్టారు. ప్రసాద్ ఇంటి ముందే ధర్నాకు దిగారు.

ఆయన ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం.. ప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం.. ఇలా పెద్ద గొడవే చేస్తున్నారక్కడ. వారిని అదుపు చేయలేక పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. తారక్ అభిమానుల మద్దతు లేకుండానే ప్రసాద్ గెలిచాడా.. ఆయనకు రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు అయిన ఆడియోపై ఎమ్మెల్యే స్పందించారు. ఈ ఆడియో తన దృష్టికి వచ్చిందని.. అది తనకు సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ ప్రత్యర్థులు తన మీద కుట్రలో భాగంగానే ఇది క్రియేట్ చేశారని.. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. తనకు నారా, నందమూరి కుటుంబాలు అంటే ఎంతో అభిమానం అని.. ముందు నుంచి వారి అభిమానిగానే ఉన్నానని ఆయన తెలిపారు. ఈ వివాదంపై మాజీ మంత్రి రోజా కూడా స్పందించారు. ఎన్టీఆర్ సినిమాలను ఆపాలి అనుకుంటే అది సాధ్యం కాదన్నారు. ఇదేమన్నా ఎన్నికలా ఈవీఎంలతో ఏమైనా చెయ్యడానికి అని ఆమె ప్రశ్నించారు.

సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు.. హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్ లాంటి సినిమాలను ఎంత ప్రయత్నించినా హిట్ చేసుకోలేక పోయారు అని.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ అభిమానులే వీరమల్లు సినిమా చూడలేదని ఆమె అన్నారు. సినిమాలను రాజకీయాలను కలపొద్దని.. ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడనీ.. మంచి సినిమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడనీ.. అలాంటి వ్యక్తి సినిమాలను ఆపాలి అనుకుంటే అది అరచేతితో సూర్యుడిని ఆపడానికి ప్రయత్నించడమే అని రోజా చెప్పారు.