నిన్న టాలీవుడ్ నిర్మాతల బృందం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసింది. అందరూ అనుకున్నట్టు ఇది ఫెడరేషన్ సమ్మె గురించి కాదు. తాజా పరిణామాలతో పాటు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశం ఏర్పాటు చేయమని అడిగేందుకు టాప్ ప్రొడ్యూసర్లు అమరావతికి వెళ్లారు. ప్రత్యేక ఎజెండా ఏమి లేకపోయినా వర్తమానంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పలు అంశాల గురించి ఇందులో చర్చించుకున్నారు. సుమారు రెండు గంటలకు పైగానే ఈ భేటీ జరగ్గా పలు కీలకమైన విషయాల గురించి కూలంకుషంగా మాట్లాడుకున్నారట.
తెలంగాణలో ఇటీవలే గద్దర్ అవార్డులు ప్రకటించి వాటిని విజేతలకు అందజేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా నంది అవార్డులను తిరిగి మొదలుపెట్టాలనే ప్రతిపాదన పలు సందర్భాల్లో వచ్చింది. ఉమ్మడిగా ఇవ్వాలా లేక విడిగా నిర్వహించాలా అనే దాని గురించి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయట. అమరావతి ప్రాంతంలో స్టూడియోలు, ఫిలిం సిటీల నిర్మాణానికి కావాల్సిన స్థలాలు, వనరుల గురించి దుర్గేష్, నిర్మాతల మధ్య డిస్కషన్ జరిగింది. టికెట్ రేట్లకు సంబంధించి ఒక స్థిరమైన వ్యవస్థ తీసుకురావాలనే ప్రతిపాదన మీటింగ్ లో వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సినిమా వాడిగా తమ సమస్యలు బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే వెంటనే సిఎం కలవలేకపోయామని చెప్పిన నిర్మాత నాగవంశీ త్వరలోనే చంద్రబాబునాయుడుని కలిసి తమ పరిస్థితులు వివరిస్తామని అన్నారు. సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఏర్పాటు చేసేలా కందుల దుర్గేష్ నుంచి హామీ వచ్చిందని మీడియా టాక్. నిజానికి రెండు నెలల క్రితం ప్లాన్ చేసుకున్న ఈ సమావేశం వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు నిన్న కుదిరింది. అయితే చంద్రబాబు, పవన్ తో జరగబోయే భేటీ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది. ఏపీలో పరిశ్రమ అడుగుకు పునాది వేయనుంది. దీనికి చొరవ తీసుకునేది పవన్ కల్యాణే.
Gulte Telugu Telugu Political and Movie News Updates